Balakrishna: సోషల్ మీడియాలో ‘వీర సింహ రెడ్డి’ రచ్చ.. డైలాగ్స్ గురించే చర్చ!
![Balakrishna: సోషల్ మీడియాలో ‘వీర సింహ రెడ్డి’ రచ్చ.. డైలాగ్స్ గురించే చర్చ!](https://kaburulu.com/wp-content/uploads/2023/01/Balakrishna.jpg)
Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులు చాలాకాలంగా వీరసింహారెడ్డి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవైపు ఆహా అన్ స్టాపబుల్ షోలో కుర్ర హీరోలతో కుర్రాడిలా కనిపిస్తున్న బాలయ్య మరోసారో సీమ బ్యాక్డ్రాప్ సినిమాలలో ఎలా ఉంటాడా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సంక్రాంతి బరిలో దిగనున్న బాలయ్య ఇప్పటికే సినిమా ప్రమోషన్ కూడా మొదలు పెట్టేశారు. అందులో భాగంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వీరసింహారెడ్డి ట్రైలర్ రానే వచ్చింది.
ఒంగోలు అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్రైలర్ను లాంఛ్ చేయగా.. సీమలో ఏ ఒక్కడూ కత్తిపట్టకూడదని నేనొక్కడినే కత్తిపట్టా.. పరపతి కోసమో పెత్తనం కోసమో కాదు.. ముందు తరాలునాకిచ్చిన బాధ్యత. నాది ఫ్యాక్షన్ కాదు.. సీమ మీద ఎఫెక్షన్ అంటూ గూస్ బంప్స్ తెప్పించేలా బాలయ్య మార్క్ డైలాగ్స్ తో షురూ అయింది ట్రైలర్. అంతేకాదు ఆధ్యంతం ట్రైలర్.. పక్కా మాస్ యాక్షన్.. ఊరమాస్ డైలాగ్స్ తో అదరగొట్టారు.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. బాలయ్య లుక్, మేనరిజం.. శృతి హాసన్ గ్లామర్.. యాక్షన్.. బాలయ్య డాన్స్ ఇలా సినిమా ఎలా ఉండబోతుందో ట్రైలర్ లో చూపించేశారు. ఇక వీటన్నిటికీ మించి ఇందులో బాలయ్య పేల్చిన డైలాగ్స్ ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారాయి. ఒకవిధంగా ఇందులో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్గా మారింది. ‘సంతకాలు పెడితే బోర్డు మీ పేరు మారుతుందేమో కానీ.. ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు’ అనే డైలాగ్తో ఈ ట్రైలర్ ముగుస్తుంది.
ఈ డైలాగ్ రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించే రాశారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండగా.. రేపు సినిమా రిలీజైతే ఇంకెన్ని డైలాగ్స్ ఉండనున్నాయో.. ఇంకెంత హీట్ పెంచనున్నారో అని నందమూరి అభిమానులు చర్చించుకుంటున్నారు. సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డితో పాటు చిరంజీవి వాల్తేర్ వీరయ్య కూడా దిగనున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలకు నిర్మాతలు ఒక్కరే కాగా.. ఇలా ఒకే సంస్థ నిర్మించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడం ఇండస్ట్రీ చరిత్రలో రికార్డుగా పేర్కొంటున్నారు.