Balakrishna : వాళ్ళ బాధ్యత నాది.. విజయ్ సాయి రెడ్డికి బాలయ్య మాట..
ఆ బాధ్యత తాను తీసుకుంటాను అంటూ ఎంపీ విజయ్ సాయి రెడ్డికి బాలకృష్ణ మాట ఇచ్చాడు.
![Balakrishna : వాళ్ళ బాధ్యత నాది.. విజయ్ సాయి రెడ్డికి బాలయ్య మాట..](https://kaburulu.com/wp-content/uploads/2023/02/balakrishna-taraka-ratna-vijay-sai-reddy.jpg)
Balakrishna : సినీ నటుడు నందమూరి తారకరత్న ఇటీవల గుండెపోటుతో హాస్పిటల్ పాలైన సంగతి తెలిసిందే. కొంత కాలంగా సినిమాలకి దూరం అవుతూ వస్తున్న తారకరత్న రాజకీయంలో యాక్టీవ్ గా మారారు. ఈ క్రమంలోనే గత నెలలో టీడీపీ లీడర్ నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్రలో పాల్గొనేందుకు కుప్పం వెళ్లారు. ఆ కార్యక్రమంలో నడుస్తూ నడుస్తూనే తారకరత్న కుప్పకూలిపోవడంతో, ఆయనని కుప్పంలోని హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే గుండె ఆగిపోవడంతో, సిపిఆర్ చేసి వైద్యులు రక్షించారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లకి తరలించారు.
Taraka Ratna : తారకరత్న మరణాన్ని చంద్రబాబు దాచిపెట్టాడు.. లక్ష్మీ పార్వతి!
అప్పటి నుంచి కోమాలో ఉన్న తారకరత్నకి వైద్యులు ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా అయన ఆరోగ్యంలో పురోగతి లేదు. దాదాపు 22 రోజులు పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న ఫిబ్రవరి 18 రాత్రి కన్నుమూశారు. ఆయన అకాల మరణానికి చింతిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇక తారకరత్న మరణంతో ఆయన కుటుంబ బాధతో కుమిలిపోతుంది. తారకరత్న కూతురు ఆయన పార్థివదేహం దగ్గర కన్నీళ్లు పెట్టుకొని విలిపించిన దృశ్యం అందరి మనసుని కలిచి వేసింది. తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి అయితే ఆయన మరణవార్త తెలిసిన దగ్గర నుంచి ఆహారం తీసుకోవడం మానేసింది. దీంతో ఆమె చాలా నిరసించిపోయిందని, అంతేకాదు ఆమె మానసికంగా కూడా చాలా సిక్ అయ్యిందని విజయ్ సాయి రెడ్డి మీడియాకి తెలియజేశాడు.
కాగా తారకరత్న మరణంతో ఆయన పిల్లల భవిషత్తు అయోమయంలో పడింది. అయితే వారి బాధ్యత తాను తీసుకుంటాను అని విజయ్ సాయి రెడ్డికి బాలకృష్ణ మాట ఇచ్చాడని, విజయ్ సాయి రెడ్డి తెలియజేశాడు. తారకరత్న, బాలయ్య బంధం ఎలాంటిదో మనందరికీ తెలుసు. తారకరత్న హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యినప్పటి నుంచి అంతా తానై చూసుకున్నాడు బాలకృష్ణ. ఇప్పుడు అతని పిల్లల బాధ్యతను కూడా అదే ప్రేమతో తీసుకున్నాడు.
ఇక తారకరత్న అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఈరోజు ఉదయం అభిమానుల సందర్శనర్థం కోసం తారకరత్న భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. మధ్యాహ్నం 3 గంటల సమయం వరకు తారకరత్న భౌతికకాయాన్ని అక్కడే ఉంచనున్నారు. అనంతరం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.