Nara Lokesh: మరోసారి జీవో 1 రగడ.. లోకేష్ పాదయాత్రలో మైక్ లాక్కెళ్లేందుకు పోలీసుల యత్నం

Nara Lokesh: ఏపీలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 1 ఎంత వివాదం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు నానా యాగీ చేసి చివరికి హైకోర్టులో కూడా స్టే తీసుకొచ్చాయి. అయితే ఆ స్టే గడువు ఉందా లేదా అనేది తెలియదు కానీ ప్రభుత్వం మాత్రం జీవోను అమలు చేస్తుంది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోతో స్వల్ప ఉద్రిక్తత నెసకొంది.
చిత్తూరు జిల్లా ఎన్ఆర్పేట ఎన్టీఆర్ కూడలిలో సభ నిర్వహణకు అనుమతి లేదంటూ నారా లోకేష్ను పోలీసులు అడ్డుకున్నారు. జీవో-1 ప్రకారం రోడ్లపై సమావేశానికి అనుమతి లేదని చెప్పడంతో టీడీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అడ్డుకున్నా.. ఎన్టీఆర్ కూడలిలోనే తనను కలవడానికి వచ్చిన ప్రజల్ని ఉద్దేశించి లోకేష్ మాట్లాడారు. సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వకపోతే ఎక్కడ పెట్టాలని నారా లోకేష్ ప్రశ్నించారు.
అలా ఉండగానే లోకేష్ చేతిలో మైకు లాక్కోవడానికి పోలీసులు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. లోకేష్ యువగళం పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా అడ్డుపడుతున్నారని.. నిబంధనల పేరుతో వేధిస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రతో వైసీపీ శ్రేణులలో వణుకు మొదలైందని అందుకే వేధిస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన లోకేష్.. సొంత ఊరిలో బస్టాండ్ కూడా కట్టలేని నువ్వు రాయలసీమ బిడ్డవా అంటూ ప్రశ్నించారు. రూల్స్ అంటూ తన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులకు మీ రాజ్యాంగాన్ని చదివి వినిపించారు. వైసీపీ నేతలకు లేని రూల్స్ తమకు పెడతామంటే ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. కొందరు పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారని ఘాటు విమర్శలు చేశారు. జగన్ రెడ్డికి భయం అంటే ఏంటో చూపిస్తా అని లోకేష్ వ్యాఖ్యానించారు.