YSRCP: ఆనం, కోటంరెడ్డి, మేకపాటి.. ముగ్గురూ గెలిస్తే అనిల్ కుమార్ రాజకీయ సన్యాసం ఛాలెంజ్!

Kaburulu

Kaburulu Desk

March 27, 2023 | 11:34 PM

YSRCP: ఆనం, కోటంరెడ్డి, మేకపాటి.. ముగ్గురూ గెలిస్తే అనిల్ కుమార్ రాజకీయ సన్యాసం ఛాలెంజ్!

YSRCP: నెల్లూరు జిల్లాలో రాజకీయం రసకందాయంగా సాగుతుంది. గత ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీలో ఇప్పుడు భారీ అగాధాలు బయటపడ్డాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అసంతృప్తులు ఆ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. చివరికి ఎమ్మెల్సీ ఎన్నికలలో పరాజయం తర్వాత ఒకేసారి ఈ జిల్లా నుండి ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ నుండి బహిష్కరించింది అధిష్టానం. ఈ వేటు తర్వాత ఇక్కడ రాజకీయాలు మరింత వేడిగా మారాయి. సవాళ్లు ప్రతిసవాళ్ళతో హాట్ హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి.

నెల్లూరు జిల్లానుంచి సస్పెండ్ అయిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు 2024లో తిరిగి ఎమ్మెల్యేలు అయితే తాను రాజకీయాలు వదిలేస్తానంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత జిల్లాకు చెందిన ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై వేటు వేసింది అధిష్టానం. కాగా, ఈ వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు.

వచ్చే ఎన్నికల్లో కోటం రెడ్డి, ఆనం, మేకపాటిలకు ఓటమి తప్పదు.. వచ్చే ఎన్నికల్లో ఈ ముగ్గురు గెలిచి అసెంబ్లీకి వస్తే.. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా.. అదే నేను గెలిచి అసెంబ్లీకి వస్తే.. మీరు రాజకీయాల నుంచి వెళ్లిపోతారా అని సవాల్ విసిరారు. 2024 ఎన్ని కల్లో ఎవరు అసెంబ్లీకి వస్తారో తేల్చుకుందామని శపథం చేశారు. అనిల్ ని అసెంబ్లీ మెట్లెక్కనివ్వబోమంటూ కొంతమంది మంగమ్మ శపథాలు చేస్తున్నారని, వారికిదే తన సవాల్ అన్నారు.

కొత్తబిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుగా కొంతమంది పచ్చ కండవా మెడలో పడగానే రెచ్చిపోతున్నారంటూ పరోక్షంగా గిరిధర్ రెడ్డిని ఎద్దేవా చేశారు. జగన్ ని మోసం చేసినవారెవరూ వచ్చే ఎన్నికల్లో గెలవరని అనిల్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ బొమ్మతోనే నేను ఎన్నికల్లో పోటీ చేస్తా.. గెలుస్తా.. నన్ను ఆపండి చూద్దాం. ముగ్గురు ఎమ్మెల్యేలు
వెళ్లడం వల్ల జిల్లాలో వైసీపీకి ఊడిందేమీ లేదు.. కార్యకర్తలు, ప్రజలు జగన్ వెంటే ఉన్నారు.. మరోసారి జగన్ కు ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.