AP MLC Elections: వైసీపీ, టీడీపీల మైండ్ గేమ్.. ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో తీవ్ర ఉత్కంఠ!

Kaburulu

Kaburulu Desk

March 23, 2023 | 12:50 PM

AP MLC Elections: వైసీపీ, టీడీపీల మైండ్ గేమ్.. ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో తీవ్ర ఉత్కంఠ!

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక పూర్తి కాగా.. మూడింట మూడు పట్టభద్రులను టీడీపీ కైవసం చేసుకొని అధికార పార్టీ వైసీపీకి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల చుట్టూ రాజకీయం మొదలైంది. ఈరోజు (మార్చి 23)న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఎవరికి వారు మైండ్ గేమ్ ఆడుతుండడం ఉత్కంఠ రేపుతోంది.

మొత్తం ఏడు సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటికే సీఎం జగన్ తోపాటు వైసీపీ ఎమ్మెల్యేలు వరుసగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా పోలింగ్ బూత్ కు చేరుకోలేదు. ఈ ఓటింగ్ కోసం తమ ఎమ్మెల్యేలు అందరినీ ఏకకాలంలో తరలించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి టీడీపీ ఎమ్మెల్యేలు పోలింగ్ కేంద్రానికి చేరుకొనేలా ఏర్పాట్లు చేసుకున్నారని తెలుస్తుంది.

ఏడు స్థానాలలో టీడీపీ ఒక్క స్థానానికి పోటీ చేస్తుంది. అయితే, టీడీపీ ఈ స్థానంలో గెలవాలంటే తప్పనిసరిగా 22 ఓట్లు కావాలి. టీడీపీ గత ఎన్నికల్లో 23 సీట్లు గెలవగా, వారిలో ఇప్పుడు నలుగురు వైసీపీ పక్షాన ఉన్నారు. టీడీపీ నుండి గెలిచిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్‌, మద్దాల గిరి ఇప్పుడు వైసీపీ పంచన చేరారు. ఈ లెక్కన చూస్తే టీడీపీ అభ్యర్థి గెలుపుకి మరో మూడు ఓట్లు కావాలి. అధికార పార్టీకి చెందిన అసంతృప్త ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

అదే సమయంలో వైసీపీకి 7 స్థానాలు గెలవాలంటే 154 ఓట్లు కావాలి. ఏడు సీట్లను దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న వైసీపీకి ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల రూపంలో రెబల్ ముప్పు పొంచి ఉంది. రెబల్స్ బెడదతో టీడీపీకి టెన్షన్ తప్పడంలేదు. ఇక జనసేన పార్టీ నుంచి గెలిచిన రాపాక మొదటి నుంచీ వైసీపీ వైపే మొగ్గుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీకి 154 ఎమ్మెల్యేల బలం ఉండగా.. టీడీపీ బలం 19 మంది బలం ఉంది. ఒకేవేళ వైసీపీ రెబల్స్ టీడీపీ అభ్యర్ధికి ఒకటేసినా మరో ఓటు కావాలి. దీనికి వైసీపీ ఎమ్మెల్యేలు 16 మంది తమతో టచ్ లో ఉన్నారని టీడీపీ చెబుతుంది. ఈ క్రమంలోనే ఈ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠగా మారాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుండగా.. అనంతరం 5 గంటల నుంచి కౌంటింగ్ మొదలుకానుంది.