MLC Election: అసెంబ్లీకి డుమ్మా కొట్టిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు.. క్రాస్ ఓటింగ్ చేసింది వీళ్లేనా?

Kaburulu

Kaburulu Desk

March 24, 2023 | 03:45 PM

MLC Election: అసెంబ్లీకి డుమ్మా కొట్టిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు.. క్రాస్ ఓటింగ్ చేసింది వీళ్లేనా?

MLC Election: ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయి.. ఫలితాలు వెల్లడై రోజు గడుస్తున్నా.. ఆ ఫలితాలు రేకెత్తించిన సంచలనాలు మాత్రం ఏపీ రాజకీయాలలో ఇంకా కలకలంగానే కొనసాగుతుంది. ఈ ఎన్నికలలో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటం సంచలనాన్ని రేకెత్తించింది. సొంత ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నలుగురి వైసీపీ ఎమ్మెల్యేలు ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థికి ఓటేశారు.

వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలలో ఇద్దరు రెబెల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటం రెడ్డిలు టీడీపీకి ఓటు వేయవచ్చనేది ముందు నుంచి అందరూ భావించిందే. అయితే మరో ఇద్దరు ఎవరనే విషయం ఆసక్తికరంగా మారింది. కోస్తా జిల్లాల నుండి నెల్లూరు వరకు పలువురు ఎమ్మెల్యేలపై అనుమానాలు, పుకార్లు వినిపించాయి. వైసీపీ ముఖ్య నేతలు కూడా స్పందిస్తూ ఆ ఇద్దరు ఎవరో తమకి తెలుసనీ.. సమయం వచ్చినపుడు బయటపెడతామని చెప్పారు.

అయితే, కోటంరెడ్డి, ఆనంతో పాటు మిగిలిన ఆ ఇద్దరూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి అయి ఉండొచ్చని నిన్నటి నుంచే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. మీడియాలో కథనాలతో పాటు నేతల సోషల్ మీడియా ఖాతాలలో కూడా ఈ ఇద్దరిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అలా అనుమానం ప్రచారంలో ఉండగానే వీరిద్దరూ శుక్రవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజు అయినా ఈ ఇద్దరు డుమ్మా కొట్టారు. దీంతో వీరిపై అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.

ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి బెంగళూరుకు వెళ్లిపోయారు. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇంకోవైపు క్రాస్ ఓటింగ్ అంశంలో తన పేరు రావడంపై ఉండవల్లి శ్రీదేవి స్పందిస్తూ.. క్రాస్ ఓటింగ్ చేయాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. పార్టీ ఇచ్చిన కోడ్ ప్రకారమే తాను ఓటు వేశానని అన్నారు. దళిత మహిళను కాబట్టే తనను చులకనగా చూస్తున్నారని చెప్పారు. స్క్రూటినీ చేసి క్రాస్ ఓటింగ్ చేసిన వారిని గుర్తించాలని అన్నారు.