YSRCP Suspended MLA’s: హాయిగా ఉందన్న మేకపాటి.. పద్ధతి కాదన్న కోటంరెడ్డి.. శ్రీదేవి ఆఫీసుపై దాడి!

Kaburulu

Kaburulu Desk

March 24, 2023 | 10:54 PM

YSRCP Suspended MLA’s: హాయిగా ఉందన్న మేకపాటి.. పద్ధతి కాదన్న కోటంరెడ్డి.. శ్రీదేవి ఆఫీసుపై దాడి!

YSRCP Suspended MLA’s: తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ కి పాల్పడినట్లు భావిస్తున్న ఎమ్మెల్యేలపై వైసీపీ సీరియస్ డెసిషన్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఒకేసారి నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. ఆనం రామనారా‍యణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై వైసీపీ తీవ్ర చర్యకు దిగింది. పార్టీ నుండి బహిష్కరించడంపై ఎమ్మెల్యేలు స్పందించారు.

సస్పెన్షన్ వల్ల ఎంతో రిలాక్స్ గా ఫీలవుతున్నానని, ఎంతో ఆనందంగా ఉన్నానని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. మంచి చేసిన వారికి కూడా కొందరు చెడు చేస్తారని మేకపాటి వ్యాఖ్యానించారు. అనుకున్నది చేసేయడం వైసీపీలో అలవాటుగా మారిందని విమర్శించారు. జగన్ కు మద్దతు ఇచ్చినందుకు పార్టీలో చాలా మర్యాదలు చేశారని వ్యంగ్యం ప్రదర్శించారు. తన నియోజకవర్గాన్ని భ్రష్టుపట్టించారని తెలిపారు. కావాలంటే ఇప్పుడే రాజీనామా చేస్తా.. ఎవరు గెలుస్తారో చూద్దామని సవాల్ విసిరారు. తాజా పరిణామాలతో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేల్లో గుసగుసలు మొదలయ్యాయని అన్నారు.

బహిష్కరణపై స్పందించిన కోటంరెడ్డి.. తనపై చర్యలు తీసుకున్న విధానం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతమని పేర్కొన్నారు. పార్టీ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే, మొదట షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో చర్యలు తీసుకోలేదన్న విషయం స్పష్టమైందని, పార్టీలో పెత్తందారీ విధానం నడుస్తోందని కోటంరెడ్డి విమర్శించారు. ఏదేమైనా, పార్టీ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని తెలిపారు.

కాగా, వైసీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డి సస్పెన్షన్ ప్రకటన చేసిన వెంటనే గుంటూరులో ఉండవల్లి శ్రీదేవి కార్యాలయంపై దాడి జరిగింది. అక్కడి ఫ్లెక్సీలు, బ్యానర్లు ధ్వంసం చేశారు. పార్టీ పట్ల ద్రోహానికి పాల్పడిన ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు. దాంతో శ్రీదేవి కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఫ్లెక్సీలు ధ్వంసం చేసిన వారిని అడ్డుకున్నారు.