Bihar Saharsa: హోమ్ వర్క్ సరిగా చేయలేదని ఎల్‌కేజీ విద్యార్థిని కొట్టి చంపిన ఉపాధ్యాయుడు!

Kaburulu

Kaburulu Desk

March 24, 2023 | 11:13 PM

Bihar Saharsa: హోమ్ వర్క్ సరిగా చేయలేదని ఎల్‌కేజీ విద్యార్థిని కొట్టి చంపిన ఉపాధ్యాయుడు!

Bihar Saharsa: ఉపాధ్యాయులంటే విద్యాబుద్ధులు నేర్పడమే కాదు.. సమాజంలో నడవడిక.. మంచి, మానవత్వం కూడా అలవరించి.. విద్యార్థిని మనిషిగా మలచడంలో కీలక బాధ్యత వహించాలి. అందుకే పురాణాల నుండి తల్లి, తండ్రి తర్వాత గురువుకు స్థానం కల్పించారు. కానీ, అలాంటి గురువులే ఇప్పుడు కాలయముళ్లుగా మారి విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నారు. టీచర్లు పెట్టే ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడే వారిని మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏకంగా ఓ టీచర్ హోమ్ వర్క్ చేయలేదని ఎల్‌కేజీ పిల్లాడిని కొట్టి చంపాడు.

బీహార్‌లోని సహర్సా జిల్లాలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ఉపాధ్యాయుడి కోపం పరాకాష్టకు చేరింది. హోం వర్క్ చేయలేదని ఓ విద్యార్ధిని అత్యంత దారుణంగా కొట్టాడు. దెబ్బలు తాళలేని ఆ విద్యార్ధి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాధేపురా జిల్లాలోని భర్రాహి గ్రామానికి చెందిన ఆదిత్య కుమార్ (7)ను సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ కమ్‌ హాస్టల్‌లో ఎల్‌కేజీ చదువుతున్నాడు. ఆదిత్యను మార్చి 14న తండ్రి హాస్టల్‌లో జాయిన్‌ చేశాడు.

ఈ క్రమంలో బాలుడు హోంవర్క్ చేయలేదని పాఠశాల డైరెక్టర్-కమ్-టీచర్ విచక్షణా రహితంగా కొట్టాడు. దీంతో అపస్మారక స్థితికి చేరుకున్న బాలుడిని సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి, బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అప్పటికే బాలుడు మృతి చెందడంతో ఆసుపత్రికి చేరుకున్న బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ పాఠశాల యాజమన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

టీచర్లు కొట్టడం వల్లే తమ బిడ్డ మృతి చెందినట్లు ఆదిత్య తండ్రి ప్రకాశ్‌ యాదవ్‌ ఆరోపించాడు. బాలుడి మృతిపై కేసునమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఆదిత్యను కొట్టిన టీచర్‌ పరారీలో ఉన్నాడని, అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బ్రజేష్ చౌహాన్ తెలిపారు.