TTD: తిరుమల శ్రీవారి ఆలయం అరుదైన రికార్డు… చరిత్రలోనే తొలిసారిగా ఆదాయం పెరిగింది…!

కలియుగ దైవంగా భావించుకునే ఏడుకొండల వేంకటేశ్వర స్వామి వారు కొలువుదీరిన టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. కలియుగ వైకుంఠం తిరుమలలో ఎటు చూసినా గోవింద నామ స్మరణే. ఏడుకొండలవాడి దర్శనం కోసం పరితపిస్తుంటారు భక్తులు. తమ శక్తి కొద్దీ కానుకలు సమర్పించుంటున్నారు. అలా.. రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. దేశంలో ఏ దేవాలయంకు లేని విధంగా ఆదాయంలో ముందు నిలిచింది.
కోవిడ్ ఎన్నో వ్యవస్థలపైనా ప్రభావం చూపింది. మహమ్మారి అన్ని రంగాలను వెంటాడింది.. ఆర్థికంగా దెబ్బతీసింది. కొన్నింటిని నిర్వీర్యం చేసింది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రం కోవిడ్ ఆదాయాన్ని అనూహ్యంగా పెంచింది. పెరిగిన బ్యాంకు వడ్డీ రేట్లతో హుండీ ఆదాయాన్ని గణనీయంగా పెంచింది. తగ్గు ముఖం పట్టాక మాత్రం గతంలో కంటే శ్రీవారి హుండీ ఆదాయాన్ని అనుహ్యంగా పెంచింది. కోవిడ్కు ముందు 1200 కోట్ల మేర హుండీ ఆదాయం టీటీడీకి వస్తుండగా.. ఇప్పుడు ఆ ఆదాయం 1500 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ క్రమంలోనే 4,411 కోట్ల రూపాయలతో టీటీడీ 2023-24 బడ్జెట్ అంచనాలకు టీటీడీ పాలక వర్గం ఆమోద ముద్ర వేసింది.
కోవిడ్ మహమ్మారి ప్రభావంపై ముందుగా అంచనా వేసిన టీటీడీ.. గతేడాది హుండీ ఆదాయం 1000 కోట్ల మేర ఉంటుందనుకుంది. అయితే అనుహ్యంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1,613 కోట్ల కానుకలు టీటీడీ ఖాతాకు చేరాయి. 2022 మార్చి నెల నుంచి ప్రతి రోజు శ్రీవారి హుండీ ఆదాయం 3 నుంచి 5 కోట్ల మేర ఉంటుండగా.. టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా గత జనవరి 2న రికార్డు స్థాయిలో ఒక్కరోజే 7.68 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. ఇలా అంతకంతకు పెరుగుతున్న ఉండి ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం కూడా అదే రీతిలో ఉంటుందని అంచనా వేసిన టీటీడీ 1,591 కోట్ల మేర హుండీ ఆదాయం వస్తుందని అంచనా వేసింది.