TTD-RBI: టీటీడీకి రిజర్వ్ బ్యాంక్ షాక్.. టీటీడీకి రూ. 3 కోట్ల భారీ జరిమానా విధించిన ఆర్బీఐ

Kaburulu

Kaburulu Desk

March 27, 2023 | 09:47 PM

TTD-RBI: టీటీడీకి రిజర్వ్ బ్యాంక్ షాక్.. టీటీడీకి రూ. 3 కోట్ల భారీ జరిమానా విధించిన ఆర్బీఐ

TTD-RBI: వడ్డీకాసుల వాడికే జరిమానా విధించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తిరుమల తిరుపతి దేవస్థానానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 కోట్ల రూపాయల భారీ జరిమానా విధించింది. దేశంలోనే అత్యంత సంపన్నమైన ధార్మిక సంస్థగా గుర్తింపు ఉన్న టీటీడీ విదేశీ మారకద్రవ్యానికి సంబంధించిన అంశంపై ఆర్బీఐ టీటీడీకి ఈ జరిమానా వేసిందని, ఆ మొత్తాన్ని చెల్లించామని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సోమవారం తెలిపారు.

భక్తులు హుండీలో వేసిన విదేశీ కరెన్సీ విషయంలో ఈ సమస్య తలెత్తిందని.. విదేశీ కరెన్సీని బ్యాంకులో జమచేసే సమయంలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) నిబంధనలు ఉల్లంఘించినందుకు ఫైన్ విధించారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీకి ఉన్న ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ 2018తోనే ముగిసింది. అయితే, దీన్ని ఇప్పటివరకు రెన్యువల్‌ చేసుకోలేదు. దీంతో ఈ సమస్య తలెత్తిందని సుబ్బారెడ్డి వివరించారు.

కాగా, భక్తుల కొంగు బంగారం ఏడుకొండల వెంకన్న స్వామి ఆలయ నిర్వహణలో అవకతవకలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. తప్పులను ఒకరిపైకి ఒకరు తోసుకోవడంలో తిరుమల గుడిలో జరగుతున్న చాలా తీవ్రమైన లోటుపాట్లు బయటికి రావడం లేదు. తీరా కేసులు నమోదై, జరిమానాలు పడ్డాకగాని టీటీడీ విషయం బయటికి చెప్పడం లేదు. అలాగే ఇప్పుడు శ్రీవారికి భక్తులు సమర్పించే విదేశీ కరెన్సీని జమ చేయడంలో తీవ్రస్థాయిలో ఉల్లంఘనలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తేల్చింది.

రెండు విడతల్లో మొత్తం రూ. 3కోట్ల జరిమానా కట్టి లైసెన్స్ రెన్యువల్ చేయాలని కోరినట్లు చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. అయితే ఉల్లంఘన వల్ల ఎలాంటి నష్టం జరిగిందో ఆయన చెప్పలేదు. కాగా ఏప్రిల్ తొలివారం నుంచి నడకదారిలో వచ్చే భక్తులకు దివ్యదర్శన టోకెన్లు ఇస్తామని ఆయన చెప్పారు. అలిపిరి నడకదారిలో రోజుకు 10వేల టోకెన్లు, శ్రీవారిమెట్టు నడకదారిలో రోజుకు 5 వేల చొప్పున టోకెన్లు ఇవ్వనున్నారు.