Nara Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు.. టీటీడీకి రూ.33 లక్షల విరాళం!

Nara Devaansh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, బ్రాహ్మణిల ముద్దుల తనయుడు నారా దేవాన్ష్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా లోకేశ్, బ్రాహ్మణి తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం ప్రకటించారు. దేవాన్ష్ ప్రతి పుట్టినరోజుకీ తిరుమల కొండపై ఒకరోజు అన్న ప్రసాద వితరణ కోసం లోకేశ్ కుటుంబం భారీ విరాళం ప్రకటించడం ఆనవాయతీగా వస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా రూ.33 లక్షలను టీటీడీ అధికారులకు విరాళంగా అందజేశారు.
తిరుమలలో తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద వితరణ కోసం ఈ విరాళాన్ని లోకేష్ దంపతులు అందించారు. తరిగొండ వెంగమాంబ నిత్య ప్రసాద వితరణ కేంద్రం భవనంలో నారా దేవాన్ష్ పేరు మీదుగా ప్రతి ఏడాది ఈ ఒక్కరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది భారీ డొనేషన్ కావడంతో తిరుమలలో ఎలక్ట్రానిక్ డిస్ ప్లే స్క్రీన్లపై దీన్ని ప్రదర్శించారు. ఆ నిత్య ప్రసాద వితరణ కేంద్రంలోని డిస్ ప్లే బోర్డులో దేవాన్ష్ పేరు కనిపిస్తోంది.
తిరుమల శ్రీవారి భక్తులు తమ కుటుంబ సభ్యుల్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే ఇలా టీటీడీ అన్న ప్రసాద వితరణకు ఇలా విరాళాలు ఇస్తుండటం ఆనవాయితీ. కాగా, కొందరు భక్తులు అన్న ప్రసాదానికి విరాళాలు ఇచ్చి తమ మొక్కుల్ని కూడా చెల్లించుకుంటూ ఉంటారు. చంద్రబాబు కుటుంబం విషయానికి వస్తే ప్రతి ఏడాది దేవాన్ష్ పుట్టినరోజున ఇలా విరాళం ఇస్తూ వస్తున్నారు. గతంలో స్వయంగా ఒకసారి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో చంద్రబాబు దంపతులు పాల్గొనడం విశేషం.
కాగా, ఈరోజు నారా లోకేష్ కదిరి నియోజకవర్గంలో 48వ రోజు యువగళం పాదయాత్రలో ఉన్నందున, కుమారుడు పుట్టిన రోజు వేడుకలలో పాల్గొనలేకపోయారు. కానీ మొటుకుపల్లి వద్ద ఆర్టీడీ ట్రస్ట్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న దివ్యాంగుల ఆశ్రమపాఠశాలను సందర్శించి, అక్కడి పిల్లలకు మిటాయిలు పంచి వారితో కాసేపు సంతోషంగా గడిపారు. కుమారుడు పుట్టిన రోజు సందర్భంగా దారిలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకొని కొడుకు పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం పక్కనే అన్నా క్యాంటీన్ని ప్రారంభించారు.