Nara Lokesh Padayatra: యువగళం పాదయాత్రలో అపశ్రుతి.. నారా లోకేష్కు గాయాలు

Nara Lokesh Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 45 రోజులు పూర్తయి 46వ రోజుకి చేరుకుంది. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం, చీకటిమానిపల్లి విడిది కేంద్రం నుంచి శనివారం లోకేష్ పాదయాత్ర ప్రారంభం కాగా.. ఉదయమే పాదయాత్రలో లోకేష్ కాస్త ఇబ్బంది పడుతూ కనిపించారు. దీంతో ఆయన అస్వస్థతకు గురైనట్లు భావించారు.
అయితే, పాదయాత్రలో తనను కలిసిన వారికి ఎడమ చేయి కలుపుతూ మాట్లాడుతుండడంతో అసలు విషయం బయటపడింది. యువ గళం పాదయాత్రలో మరో అపశృతి చోటు చేసుకుంది. యువ గళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ భుజాలకి గాయాలైనట్లు తెలుస్తుంది. అందులో కుడి భుజం నొప్పి ఎక్కువగా ఉన్నా నారా లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ భుజం నొప్పి కారణంగానే రోజు వారీ కార్యక్రమాలలో కొన్నిటిని రద్దు చేసినట్లు తెలుస్తుంది.
ప్రతిరోజూ లోకేష్ పాదయాత్ర ప్రారంభించే ముందు సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రతీ రోజూ సుమారుగా వెయ్యి మందికి పైగా అభిమానులు, కార్యకర్తలు లోకేష్తో సెల్ఫీ దిగుతుంటారు. అయితే శనివారం పాదయాత్ర ప్రారంభం ముందు ఈ సెల్ఫీ కార్యక్రమం కూడా నిర్వహించలేదు. అందుకు కారణం లోకేష్ గాయపడటమే అని తెలుస్తోంది. పాదయాత్రలో కూడా లోకేష్ భుజాలు లేపి అభివాదం చేసేందుకు కాస్త ఇబ్బందిపడుతూ కనిపించారు.
కాగా, శుక్రవారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లోకేశ్ పాదయాత్ర ముగియనుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 45 రోజుల పాటు యువగళం యాత్ర సాగగా చివరి రోజు లోకేష్ ఉదయం నుండి సాయంత్రం వరకూ ఖాళీ లేకుండా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఉదయం 1000 మందితో సెల్ఫీలు, కమ్మలపల్లి వద్ద యువతీ, యువకులతో ముఖాముఖీ, కలవడానికి వచ్చిన ప్రజలను, యువతను పలకరించి పాదయాత్ర మొదలు పెట్టారు. ఆ తర్వాత మొలకలచెరువు బహిరంగ సభలో ప్రసంగించిన లోకేష్.. ప్రభుత్వపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.