MLA Raja Singh: చంపుతామని బెదిరిస్తున్నారు.. నాకు గన్ లైసెన్స్ ఇవ్వండి.. డీజీపీకి రాజాసింగ్ లేఖ!

MLA Raja Singh: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గన్ లైసెన్స్ కోసం ఇప్పటివరకు ఎన్నోసార్లు రిక్వెస్ట్ లెటర్ ఇచ్చినా.. తనపై కేసులు ఉన్నాయన్న కారణంతో పోలీసులు గన్ లైసెన్స్ ఇవ్వటం లేదన్నారు. కొంతమందిపై కేసులు ఉన్నా కూడా లైసెన్స్ పొందిన విషయాన్ని రాజాసింగ్ గుర్తు చేశారు. తనకు ప్రాణహాని ఉందని మెురపెట్టుకుంటున్నా గన్ లైసెన్స్ ఇవ్వడం లేదని డీజీపీకి రాసిన లేఖలో రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
దాదాపు 8 నెంబర్ల నుంచి తనకు కంటిన్యూగా ఫోన్లు వస్తున్నాయన్నారు. పాకిస్థాన్ నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ కు రాజాసింగ్ ఈ మేరకు లేఖ రాశారు. బెదిరింపుల గురించి చెప్పినా.. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందని లైసెన్స్ గన్ ఇవ్వాలని డీజీపీని రాజాసింగ్ మరోసారి కోరారు.
ఓ ఎమ్మెల్యేకు పాకిస్థాన్ నుంచి బెదిరింపులు వస్తున్నా హైదరాబాద్ పోలీసులు పట్టించుకోకపోవడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ఒకవేళ ‘జైశ్రీరాం’ అని నేను ట్వీట్ చేస్తే, హిందూ సోదరులకు మద్దతుగా గొంతు వినిపిస్తే మాత్రం.. పోలీసులు వెంటనే స్పందిస్తారు. కేసు నమోదు చేస్తారుని ట్విట్టర్ లో విమర్శించారు. చర్యలు తీసుకోకుండా హైదరాబాద్ సీపీని ఎవరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
గతంలో కూడా తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని రాజాసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం ఆయనకు భద్రత పెంచింది. పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం సరిగా లేదని పలుమార్లు ఫిర్యాదు చేయడంతో ఈ మధ్యనే పాత వాహనం స్థానంలో మరో వాహనం కేటాయించారు. తాజాగా తనకు మళ్లీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ రాజాసింగ్ డీజీపీకి లేఖ రాయటం చర్చనీయాంశమైంది. మరి, దీనిపై పోలీసులు స్పందిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.