Tirumala Tirupati: తిరుమలలో కొత్త రూల్.. ఇకపై నెలకి ఒక్కసారి మాత్రమే శ్రీవారి దర్శనం!

Kaburulu

Kaburulu Desk

March 1, 2023 | 06:00 PM

Tirumala Tirupati: తిరుమలలో కొత్త రూల్.. ఇకపై నెలకి ఒక్కసారి మాత్రమే శ్రీవారి దర్శనం!

Tirumala Tirupati: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి కరుణా కటాక్షాల కోసం తెలుగు రాష్ట్రాల నుండే కాదు ప్రపంచ నలుమూలల నుండి వేచి ఉంటారు. ఆ ఏడుకొండలు ఎక్కి వెంకన్నన్ని దర్శించుకుని పరవశించిపోతుంటారు. మన తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కన తమిళనాడు, కర్ణాటక ప్రజలైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. అయితే, ఇకపై అలా కుదరదు.

ఎందుకంటే, నేటి నుంచి తిరుమలకు వచ్చే భక్తులను నెలకి ఒకసారి మాత్రమే అనుమతించనున్నారు. దాని కోసం ఫేస్ రికగ్నిషన్​ను అమల్లోకి తీసుకొస్తున్నారు. భక్తులకు సేవలను సజావుగా అందించడంతో పాటు పారదర్శకత కోసమే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టినట్లు టీటీడీ ప్రకటించింది. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని తొలుత సర్వదర్శనం కౌంటర్లు, తిరుమలలోని లడ్డూ కౌంటర్లు, వసతి కేంద్రాల్లో ప్రవేశపెట్టారు.

అనంతరం కొద్దిరోజులలో దేవస్థానానికి వచ్చే ప్రతి భక్తులకు ఈ విధానాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఈ విధానంతో దళారుల వ్యవస్థ తగ్గే చాన్స్ ఉందని టీటీడీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని అమల్లోకి తీసుకురావడం వల్ల ఒక్కో భక్తుడు నెలకు ఒకసారి మాత్రమే తిరుమలలో రూమ్ పొందేలా టీటీడీ చర్యలు చేపడుతోంది. దీంతో నెలలో ఒకసారి మాత్రమే ఉచిత దర్శనం చేసుకునేందుకు భక్తులను అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఈ కొత్త విధానం వల్ల తిరుమలలో ఉచిత దర్శనం కోసం ప్రయత్నిస్తున్న వారు ఇకపై నెల వ్యవధిలో ఒక్కసారికే పరిమితమవుతారని తెలిపారు. అలాగే వసతి కేంద్రాలు, లడ్డూ కౌంటర్లలో కూడా నెలకి ఒకసారి మాత్రమే సేవలు వినియోగించుకొనే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఉచిత దర్శనానికి మాత్రమే ఉన్న ఈ సేవా విధానం ముందుముందు అన్ని దర్శనాలకు కూడా వర్తించేలా చేస్తామని కూడా టీటీడీ అధికారులు చెప్తున్నారు.