AP Capital: ఏపీ రాజధాని వ్యవహారంలో మరో మలుపు.. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్!

Kaburulu

Kaburulu Desk

February 8, 2023 | 11:21 PM

AP Capital: ఏపీ రాజధాని వ్యవహారంలో మరో మలుపు.. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్!

AP Capital: : ఏపీ రాష్ట్ర రాజధాని వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఏపీ రాజధాని వ్యహారంపై కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. దీంతో ఈనెల 23న ఏపీ రాజధాని అంశంపై విచారణ జరగనుంది. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ దాఖలైన పిటీషన్లు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉన్నాయి.

అమరావతిని ఆరు నెలల్లోగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు దాఖలు చేసిన ఆదేశాలపై ఇదివరకే సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ పిటీషన్లపై తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీన చేపట్టనుంది. కిందటి నెల 31వ తేదీ నాడే తొలుత దీన్ని లిస్టింగ్ చేసినప్పటికీ విచారణ సాధ్యం కాలేదు. అది ఎప్పటికి విచారణకు వస్తుందన్నది సస్పెన్స్ గా కొనసాగుతున్న తరుణంలో కేంద్రం ఏపీ రాజధానిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించడం ఆసక్తిగా మారింది.

కాగా, ఈరోజే పార్లమెంట్‌లో ఏపీ రాజధానిపై ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించగా కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం అమరావతి అంశం కోర్టు పరిధిలో ఉందని.. మూడు రాజధానుల అంశంపై కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం సంప్రదించలేదని వివరణ ఇచ్చింది. అయితే, ఈ కేసుపై జనవరి 31న విచారణ జరగాల్సి వుంది. కానీ, ఆరోజు బెంచ్ మీదకు రాలేదు. ఈ నేపథ్యంలో అమరావతిపై దాఖలైన కేసులను తక్షణమే విచారించాలని సుప్రీంకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్‌కు ఏపీ ప్రభుత్వం శనివారం లేఖ రాసింది.

ఫైనల్ గా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే అఫిడవిట్ దాఖలు చేయనుంది. ఏపీ రాజధాని వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సభలో ఇప్పటికే కీలక ప్రకటన చేసింది. ఇదివరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుందని గుర్తు చేసిన కేంద్రం ఇప్పుడు ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో విచారణలో ఉందని వివరించింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారమే అమరావతి రాజధానిగా ఏర్పాటైందని కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అఫిడవిట్ లో ఏం చెప్పనుందన్నది ఆసక్తిగా మారింది.