Delhi Liquor Scam: లిక్కర్ కేసులో కొత్త మలుపు.. ఈడీ కాదు.. సిట్ తో విచారణ జరపాలని సుప్రీంలో కవిత అభ్యర్థన!

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ తనకు సమన్లు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీం కోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ కొనసాగింది. కవిత తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదించారు. చట్టం ప్రకారం దర్యాప్తు సంస్థలు మహిళను ఇంటిదగ్గరే విచారణ జరపాలని, తనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కవిత కోరారు.
అంతేకాదు, వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ తనకు పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం జారీచేసిన నోటీసులు సీఆర్పీసీ సెక్షన్ 160కి విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. వాంగ్మూలం నమోదు చేసేటప్పుడు న్యాయవాది సమక్షంలో వీడియో చిత్రీకరణకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారణ జరిపే విషయంలో గతంలో దాఖలు చేసిన నళినీ చిదంబరం పిటిషన్కు సుప్రీంకోర్టు ట్యాగ్ చేసింది.
అయితే, కవిత తన పిటిషన్లో సరికొత్త అభ్యర్థన చేశారు. మద్యం పాలసీ కేసు విచారణ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేయాలని కోరారు. ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. విజయ్ మండల్ జడ్జిమెంట్ పీఎంఎల్ఏ కేసుల్లో వర్తించదని, పీఎంఎల్ఏ చట్టం కింద ఎవరినైనా విచారణకు పిలిచే అధికారం ఈడీకి ఉంటుందని.. పీఎంఎల్ఏ సెక్షన్ 160 ఇక్కడ వర్తించదని ఈడీ వాదించింది.
ఆపై లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని ఈడీ, కవితలను ఆదేశిస్తూ. జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్పై విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. దీంతో ప్రస్తుతానికైతే కవితకు ఎలాంటి రిలీఫ్ దక్కలేదనే చెప్పాలి. కవిత మార్చి 14న ఈ పిటిషన్ దాఖలు చేస్తూ అత్యవసర విచారణ జరపాలని కోరారు. అయితే దానిని సీజేఐ తిరస్కరించారు. ఇప్పుడు విచారణలో ఎలాంటి రిలీఫ్ లేకుండానే ఈ కేసు మూడు వారాలకు వాయిదా పడింది.