Delhi Liquor Scam: కవిత పాత ఫోన్లలో ఈడీ డేటా రికవరీ ప్రయత్నాలు.. కవిత ప్రతినిధిగా లాయర్ హాజరు!

Delhi Liquor Scam: దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కవితను ఇప్పటి వరకూ మూడుసార్లు ఈడీ విచారించగా.. మూడు రోజులు మొత్తం 27 గంటలకు పైగా సుదీర్ఘ విచారణ జరిగింది. విచారణ తర్వాత మళ్లీ నోటీసులుంటాయని కానీ.. ఇంకా విచారించాల్సి ఉందనే విషయం కానీ ఎక్కడా బయటికి రాలేదు.
అయితే, ఈడీ విచారణ సందర్భంగా కవిత పాత ఫోన్లను కూడా స్వాధీన పరుచుకున్న సంగతి తెలిసిందే. ఈ స్కాంలో కవిత తన ఫోన్లను మారుస్తూ వచ్చారన్నది ఈడీ అభియోగం కాగా.. ఇప్పుడు ఆ పాత ఫోన్లలో డేటా రికవరీ చేసే పని మొదలు పెట్టింది ఈడీ. దీంతో తన ప్రతినిధిగా లాయర్ సోమా భరత్ ను కవిత ఈడీ ఆఫీసుకు పంపించారు. ఫోన్లు ఓపెన్ చేస్తున్నాం.. మీరు హాజరుకావాలంటూ ఈడీ అధికారులు కవితకు సమాచారం ఇవ్వగా.. తాను రాలేనని.. తన ప్రతినిధిగా లాయర్ సోమా భరత్ హాజరవుతారని సమాచారం ఇచ్చారామె.
ఈ మేరకు ఆయన మంగళవారం ఉదయం 12 గంటల సమయంలో ఢిల్లీలోని ఈడీ ఆఫీసులోకి వెళ్లారు. మార్చి 21వ తేదీన ఈడీ విచారణకు హాజరైన కవిత.. తాను ఉపయోగించిన తొమ్మిది ఫోన్లను అధికారులకు అందజేశారు. వాటిని ఇప్పటి వరకు ఓపెన్ చేయకపోగా మంగళవారం టెక్నికల్ టీం సాయంతో.. ఆ ఫోన్లలోని డేటా తీసుకోవటానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈడీ ఆఫీసులో కవిత తొమ్మిది ఫోన్లలోని డేటా రికవరీ సాగుతుంది.
మార్చి 11వ తేదీ ఈడీ విచారణకు హాజరైన సమయంలో.. ఫోన్ల విషయంపై ప్రశ్నించారు అధికారులు. ఈ క్రమంలోనే 21వ తేదీ విచారణకు వెళ్లే సమయంలో వాటిని అందజేశారు. ఇప్పుడు ఫోన్లలోని డేటా, ఇతర సమాచారాన్ని కవిత లాయర్ సోమా భరత్ సమక్షంలో సేకరించటం.. వాటిని పరిశీలించటం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ కేసుపై మరో కోణంలో ఉత్కంఠ మొదలైంది.