Delhi Liquor Case: నిన్న 10 గంటల పాటు విచారణ.. నేడు మరోసారి ఈడీ విచారణకు కవిత!

Kaburulu

Kaburulu Desk

March 21, 2023 | 08:32 AM

Delhi Liquor Case: నిన్న 10 గంటల పాటు విచారణ.. నేడు మరోసారి ఈడీ విచారణకు కవిత!

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఈరోజు (మంగళవారం) మరోసారి ఈడీ ఎదుట హాజరు కానున్నారు. ఈ మేరకు ఈడీ సమన్లు జారీ చేసింది. కాగా ఈ కేసుకు సంబంధించి తొలిసారిగా ఈ నెల 11న కవితను విచారించిన ఈడీ అధికారులు.. రెండోసారి సోమవారం ప్రశ్నించారు. 11న జరిగిన విచారణకు కొనసాగింపుగా సోమవారం పలు అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది.

ముఖ్యం గా సౌత్ గ్రూప్ లావాదేవీలు, ఈ కేసులో నిందితులుగా ఉన్న వారితో హైదరాబాద్, ఢిల్లీ హోటళ్లలో సమావేశమయ్యారనే ఆరోపణలపై ప్రశ్నించినట్లు తెలిసింది. సోమవారం కవితను ఈడీ అధికారులు 14 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. అన్ని ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అరుణ్‌ పిళ్లైతో కవిత ముఖాముఖీ విచారణ జరగలేదని సమాచారం. విచారణ ముగిసిన తర్వాత బయటకొచ్చిన కవిత అభిమానులకు విజయచిహ్నం చూపిస్తూ చిరునవ్వు చిందించగా.. అభిమానులు ఆమెకు గుమ్మడికాయతో దిష్టి తీశారు. ఆ తర్వాత ఢిల్లీలోని సీఎం కేసీఆర్‌ నివాసానికి వెళ్లారు.

ఇక, ఈరోజు ఉదయం 11:30కి విచారణకు రావాలని ఈడీ అధికారులు కవితకు మరోసారి నోటీసులు ఇచ్చారు. నేడు విచారణకు వెళ్లే ముందు కవిత మీడియాతో మాట్లాడనున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ సమయంలో ఫోన్లకు సంబంధించి ఈడీ చేస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇవ్వనున్నారు. ధ్వంసం చేశారన్న ఫోన్లను మీడియాకు చూపించే చాన్స్ ఉంది. సోమవారం విచారణ వివరాలనూ మీడియాకు కవిత చెప్పనున్నట్లుగా తెలుస్తోంది.

మరోవైపు ఈడీ తనకు జారీచేసిన సమన్లను కొట్టేయాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్, ఆ కేసులో తమ వాదనలు వినకుండా ఉత్తర్వులు జారీ చేయొద్దని కోరుతూ.. ఈడీ దాఖలు చేసిన కెవియట్లు ఈ నెల 24న విచారణకు రానున్నాయి.