Ramdev: అల్లోపతి ఓ పనికిమాలిన వైద్యం.. ఇంగ్లీష్ మందులపై రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు!

Ramdev: అల్లోపతి ఓ పనికిమాలిన వైద్యం అంటూ యోగాగురు రాందేవ్ బాబా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా టీకా ఓ ఫెయిల్యూర్ అంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బాబా మళ్లీ అదే వ్యాఖ్యలు చేశారు. ఈసారి కూడా అల్లోపతి వైద్యాన్ని తీవ్రంగా విమర్శించారు. అల్లోపతిని భూమిలో పాతిపెట్టాలని వ్యాఖ్యానించారు. ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల ప్రజలు మరింత అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పుకొచ్చారు.
ఉత్తరాఖండ్ హరిద్వార్లోని రిషికుల్ ఆయుర్వేద కాలేజీలో నిర్వహించిన ఓ సెమినార్లో మాట్లాడారు. అదే సెమినార్లో ఎంబీబీఎస్ డాక్టర్లున్నా.. మీరు నా మాటలకు బాధపడొద్దు’ అని సన్నాయి నొక్కులు నొక్కుతూనే బాబా రాందేవ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. తన మాటలను వక్రీకరించకుండా.. అర్థం చేసుకునే విధంగా అర్థం చేసుకుంటే డాక్టర్లు సైతం తనకే మద్దతుగా నిలుస్తారంటూ వ్యాఖ్యానించారు.
అల్లోపతి వైద్యంలో కేన్సర్, హై హైబీపీ, మధుమేహం వంటి వ్యాధులకు చికిత్స లేదన్న రాందేవ్ బాబా.. ఆయుర్వేద వైద్యంతో వీటిని పూర్తిగా నయం చేయవచ్చన్నారు. ఆవు పాలతో రోగ నిరోధకశక్తి పెరుగుతుందన్న ఆయన వాటితో చాలా వరకు రోగాలను నయం చేయవచ్చన్నారు. గోమూత్రం, ఆయుర్వేద ఔషధాల కలయికతో కేన్సర్ వంటి వ్యాధులను తమ సంస్థలో నయం చేసినట్టు రాందేవ్ బాబా చెప్పుకొచ్చారు.
ఆయుర్వేదం ఉపయోగించి కరోనాకు మనం మందు కనుక్కున్నాం. కానీ, ఇప్పటివరకు అల్లోపతి నుంచి కరోనా ఔషధం విడుదల కాలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో 25 శాతం మందికి ఫ్యాటీ లివర్ సమస్యలు ఉన్నాయని.. దీనంతటికీ అల్లోపతి ఔషధాలే కారణమని ఆరోపించారు. అల్లోపతి మందుల వల్ల అనేక మంది కిడ్నీలు దెబ్బతిన్నాయన్నారు. కాగా, ఈ సదస్సుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి, కేబినెట్ మంత్రి సత్పాల్ మహారాజ్, ఆయుర్వేద వర్సిటీ వైస్ చాన్సలర్ సునీల్ జోషి తదితరులు హాజరయ్యారు. అల్లోపతి వైద్యంపై రాందేవ్ బాబా గతంలోనూ పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.