Haryana Jind: పెళ్లి కొడుకును చూసేందుకు ఎగబడిన పెళ్లికూతురు బంధువులు.. ఇంటి స్లాబ్ కూలి విషాదం!

Haryana Jind: వెంకీ పెళ్లి సుబ్బి చావుకొచ్చిందనే సామెత వినే ఉంటారు కదా. కొన్నిసార్లు కొన్ని పెళ్లిళ్ల ఇలాగే జరుగుతుంది. పెళ్లి చేసుకొనేవారు బాగానే ఉంటారు కానీ.. ఆ పెళ్లికి వచ్చిన వారికి తిప్పలు పడాల్సి వస్తుంది. ఈ పెళ్లిలో కూడా అంతే. పెళ్లికొడుకును చూసేందుకు బంధువులు ఎగబడడంతో జరిగిన ప్రమాదంలో 16 మంది గాయపడ్డారు. దీంతో పెళ్లి సందడితో ఆనందంగా ఉన్నవారందరూ ఒక్కసారిగా విషాదంలో కూరుకుపోయారు.
హరియాణాలోని జింద్ జిల్లాలో గల ఖట్ఖడ్ గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. మనిషా అనే యువతికి రోహతక్కు చెందిన ఓ యువకుడితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. రెండు కుటుంబాల నుండి బంధువులు, పెద్దలు అంతా కలిసి ఆదివారం రాత్రి మూడు ముళ్లు వేసేందుకు ముహుర్తం కుదిర్చారు. ఇక, పెళ్లి కోసం వధువు ఇంటి వద్ద ఘనంగా ఏర్పాట్లు కూడా చేశారు. కాసేపట్లో పెళ్లి అనగా బంధువులంతా పెళ్లి కుమారుడు రాక కోసం ఆస్తకిగా ఎదురుచూస్తున్నారు.
ఇంతలోనే వరుడు ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో పెద్ద ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నాడు. వారి ఆచారాలు ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. అయితే, పెళ్లికొడుకును చూడాలనే ఆసక్తి ప్రమాదానికి కారణమైంది. వరుడు జయమాలా అనే క్రతువు నిర్వహిస్తుండగా.. ఇంతలో అతడిని చూసేందుకు వధువు తరపు బంధువులు ఎగబడ్డారు. ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ సరిపోక అనేక మంది ఆ భవంతి మొదటి అంతస్తులోని బాల్కినీలో నిలబడి తొంగి చూశారు.
ఇంతలో బాల్కనీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వారిపై ఈ బాల్కనీ మీద పడటంతో పురుషులు, మహిళలతో సహా మొత్తం 16 మంది గాయపడ్డారు. ఫొటోలు తీసేందుకు వచ్చిన ఫొటోగ్రాఫర్కు సైతం గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. బాధితుల్లో మహిళలతో పాటు చిన్నారులు ఎక్కువగా ఉన్నారు.