CM Jagan: నేడు మరోసారి ఢిల్లీకి జగన్.. రెండు వారాలలో ఢిల్లీ పర్యటన రెండోసారి.. మోడీతో ప్రత్యేక భేటీ!

CM Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ నేడు మరోసారి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం సీఎం జగన్ గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈనెల 16వ తేదీన ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ ప్రధాని మోడీతోనూ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతోనూ చర్చలు జరిపారు. అనంతరం, అక్కడి నుండి తిరిగి వచ్చారు. కాగా, రెండు వారాల వ్యవధిలోనే నేడు మరోసారి జగన్ హస్తినకు బయలుదేరారు.
రెండు రోజుల క్రితం పార్లమెంట్ సమావేశాల్లో ఏపీకి సంబంధించి రెండు కీలక విషయాలు సభముందుకు వచ్చాయి. అందులో ఒకటి ఏపీకి ప్రత్యేక హోదా అంశం, రెండోది పోలవరం ఎత్తుకు సంబంధించిన అంశం. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తి లేదని, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినట్లు స్పష్టం చేసిన కేంద్రం.. అదేసమయంలో, పోలవరం ఎత్తుపై కూడా కేంద్రం ప్రకటన చేసింది. ఈ రెండు అంశాలు ఏపీకి కీలకంగా మారాయి.
ఇక, ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత, జగన్ గవర్నర్ నజీర్తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముగిసిన తరువాత సీఎం ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాగా, ఈరోజు రాత్రికి కేంద్రహోంశాఖ మంత్రి అమిత్షాను కలిసే అవకాశం ఉండగా.. శుక్రవారం రోజున సీఎం జగన్ ప్రధాని మోడీని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోసారి హుటాహుటిన సీఎం ఢిల్లీకి వెళ్తుండటంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది.
ఈ నెల 16న అసెంబ్లీ సమావేశాలను కూడా పక్కన పెట్టి మరీ ఆయన ఢిల్లీకి వెళ్లారు. 17న మోదీ, అమిత్ షాను కలిశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వాటి గురించి చర్చించడానికే ఢిల్లీకి వెళ్లానని జగన్ చెప్పారు. ఇప్పుడు విశాఖలో జీ-20 లాంటి ప్రతిష్టాత్మక సదస్సు జరుగుతున్న తరుణంలో ఆ కార్యక్రమాన్ని పక్కనపెట్టి మరీ ఢిల్లీకి వెళ్తుండటంపై ఆసక్తి నెలకొంది. జగన్ కు మోదీ, అమిత్ షా ల అపాయింట్ మెంట్లు ఇప్పటికే ఖరారయ్యాయి.