CM Jagan: నేడు ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ.. దేని కోసం ఈ భేటీ అనే దానిపై తీవ్ర ఉత్కంఠ!

CM Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్ నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన ప్రధాని మోడీని కలవనున్నారు. నిన్ననే ఢిల్లీ చేరుకున్న జగన్ జన్ పథ్ ఒకటిలో రాత్రి బస చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ 11 గంటలకు ఖరారు అయినట్లు తెలుస్తొంది. ఆ తర్వాత హోంశాఖ మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులతోనూ సీఎం జగన్ భేటీ కానున్నట్లు సమాచారం.
రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపై ప్రధాని మోడీతో జగన్ చర్చించనున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఓవైపు రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ముఖ్యమైన పని ఉండగానే ఆయన సాయంత్రం ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్లడంపై అనేక ఊహాగానాలు, చర్చలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైతే సీఎం పర్యటన కారణాల గురించి పూర్తిస్థాయి అధికారిక సమాచారం ఇవ్వలేదు.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ హుటాహుటిన సీఎం జగన్ హస్తినకు చేరుకోవడం, ప్రధాని మోడీతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై జగన్ ప్రధానితో చర్చించనున్నారని సమాచారం. పోలవరం ప్రాజెక్ట్, విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై కూడా జగన్ ప్రధానితో చర్చించనున్నారని రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
బీజేపీకి వైసీపీ అనధికార మిత్రపక్షంగా కొనసాగుతున్నా కేంద్ర దర్యాప్తు సంస్థల నుండి ఏపీ ప్రభుత్వానికి తలనొప్పులు ఉంటూనే ఉన్నాయి. ఏపీ రాజధాని అంశంపై విశాఖ నుండి పరిపాలన చేయాలన్న దృఢ సంకల్పంతో సీఎం జగన్ ఉన్నారు. మరోవైపు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడుగా వైసీపీ ఎంపి అవినాష్ రెడ్డిని విచారించడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు జారీ, ఆయన కుమారుడు ఇప్పటికే జైల్లో ఉండడం.. ఇన్ని కారణాల నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారని రాజకీయ వర్గాలు బలంగా చెప్తున్నాయి.