CM Jagan: నేడు ఢిల్లీకి సీఎం జగన్.. ప్రధాని మోడీ, అమిత్ షాలతో భేటీ.. సర్వత్రా ఉత్కంఠ!

Kaburulu

Kaburulu Desk

March 16, 2023 | 01:55 PM

CM Jagan: నేడు ఢిల్లీకి సీఎం జగన్.. ప్రధాని మోడీ, అమిత్ షాలతో భేటీ.. సర్వత్రా ఉత్కంఠ!

CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈరోజు సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్లే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశముందని తెలిసింది.

గురువారం రాత్రి 7:30 గంటలకు సీఎం జగన్ హస్తినకు పయనం కానున్నారు. అయితే, ఓవైపు నేడు రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆయన అసెంబ్లీలో ఉండడం ముఖ్యమైన అంశం. అయినా కూడా ఆయన సాయంత్రం ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్లడంపై అనేక ఊహాగానాలు, చర్చలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైతే సీఎం పర్యటన కారణాల గురించి పూర్తిస్థాయి అధికారిక సమాచారం ఇవ్వలేదు.

కానీ, విశాఖ నుంచి పాలన కొనసాగించే అంశం గురించి ఢిల్లీ పెద్దలకు సీఎం జగన్ సమాచారం ఇవ్వనున్నారని.. అలాగే రాష్ట్రంలోని సమస్యలు, పెండింగ్ బకాయిలు వంటి అంశాలకు సంబంధించి ప్రధానితో చర్చించే అవకాశం ఉందని.. రాజధాని అంశంపై కూడా కేంద్ర పెద్దలతో చర్చించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే ఇటీవల ఏపీలో చోటు చేసుకున్న పరిణామాలు సీఎం జగన్ పర్యటనపై ఉత్కంఠ రేపుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నాలుగు ఏళ్లలో సీఎం జగన్ ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లారు. కానీ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశం ఉండగా ఆయన ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్లడంపై పెద్ద చర్చే నడుస్తుంది.