YSRCP: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీ ఫారాలు అందించిన సీఎం జగన్!

Kaburulu

Kaburulu Desk

March 9, 2023 | 03:32 PM

YSRCP: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీ ఫారాలు అందించిన సీఎం జగన్!

YSRCP: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక సంగతి ఎలా ఉన్నా.. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక మాత్రం రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్నాయి రాజకీయ వర్గాలు. అధికార ప్రతిపక్ష పార్టీలు వైసీపీ, టీడీపీ హోరాహోరీ ఈ ఎన్నికల కోసం పనిచేస్తున్నాయి. కాగా, గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు సీఎం జగన్ ను కలిశారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు సీఎం జగన్ చేతులు మీదుగా బి-ఫారాలు అందుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు పోతుల సునీత, పెన్మత్స సూర్యనారాయణ రాజు, కోలా గురువులు, జయమంగళ వెంకటరమణ, చంద్రగిరి ఏసురత్నం, బొమ్మి ఇజ్రాయెల్, మర్రి రాజశేఖర్ లు సీఎం జగన్ నుంచి బి-ఫారాలు స్వీకరించారు. ఈ సందర్భంగా, తమకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

కాగా, ఏపీలో ఎమ్మెల్యే కోటా కింద 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం మార్చి 6వ తేదీన నోటిఫికేషన్ కూడా విడుదల చేయగా.. మార్చి 13వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 14 నామినేషన్ల పరిశీలన, 16వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు అని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఒకవేళ ఎన్నిక అనివార్యమైతే మార్చి 23వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నారు.

దీంతో వైసీపీ అభ్యర్థులు ఈరోజే నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే అసెంబ్లీలో వైసీపీకి భారీ బలం ఉన్న సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ అభ్యర్థుల ఎంపిక లాంఛనమే అని అంతా భావించారు. కానీ, టీడీపీ కూడా అభ్యర్థిని నిలిపే ఆలోచన ఉన్నట్లు వినిపిస్తుంది. అదే జరిగితే ఎన్నిక జరగడంతో పాటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చే ఆలోచన ఉన్నట్లు కనిపిస్తుంది. టీడీపీ నుండి గెలిచి రెబల్స్ గా మారిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్‌, మద్దాల గిరిని దృష్టిలో ఉంచుకొని విప్ జారీచేసి.. విప్‌ను ఉల్లంఘిస్తే వారిపై ఈసీకి ఫిర్యాదు చేసేందుకు అవకాశంపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.