Rahul Gandhi: దొంగలందరికీ మోడీ అనే పేరు ఎలా వచ్చిందనే వ్యాఖ్య.. రాహుల్ కి రెండేళ్ల జైలు శిక్ష!

Rahul Gandhi: సార్వత్రిక ఎన్నికలను సమయం దగ్గర పడుతున్న కొద్దీ జాతీయ రాజకీయాలలో వేడి కూడా పెరుగుతుంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తోండగా.. సరిగ్గా ఇటువంటి సమయంలో గతంలో ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యల కేసు మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పరువునష్టం దావాను ఎదుర్కొంటున్న రాహుల్ ను దోషిగా నిర్థారిస్తూ సూరత్ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది.
2019లో కర్నాటకలోని కోలార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. దేశంలోని దొంగలందరి ఇంటి పేర్లు మోడీ అనే ఎందుకు ఉంటాయంటూ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ కోర్టులో కేసు వేశారు. తన వ్యాఖ్యల ద్వారా మొత్తం మోడీ కమ్యూనిటీని రాహుల్ గాంధీ అవమానపరిచినట్టయిందని పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా, రెండేళ్ల విచారణ తర్వాత.. వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఈ క్రమంలోనే 2023, మార్చి 23వ తేదీ గురువారం కట్టుదిట్టమైన భద్రత నడుమ సూరత్ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఇరువైపుల వాదనలు విన్న కోర్టు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. రాహుల్ గాంధీ ప్రధాని మోడీ ప్రతిష్టకు భంగం కలిగించారని.. సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయని నిర్థారించుకొని రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఆ వెంటనే బెయిల్ కూడా మంజూరు చేసింది.
కాగా, రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ గురువారం సూరత్ లో పోస్టర్లు వేసింది. కోర్టు విచారణ కోసం కాంగ్రెస్ ఎంపీ వచ్చినప్పు డు సూరత్ కోర్టు వెలుపల పోస్టర్లు కనిపించాయి. ‘ప్రజాస్వామ్యానికి మద్దతుగా సూరత్ కు వెళ్దాం’అని ఆ పోస్టర్ లలో ఉంది. ఈ పోస్టర్ లలో భగత్ సింగ్, సుఖ్ దేవ్ చిత్రాలు కూడా ఉండటం గమనార్హం.