TSPSC Paper Leak Case: బండి సంజయ్‌ని నేడు విచారణకు రావాలన్న సిట్.. రాలేనని అమిత్ షాతో బెంగళూరుకి!

Kaburulu

Kaburulu Desk

March 26, 2023 | 09:08 AM

TSPSC Paper Leak Case: బండి సంజయ్‌ని నేడు విచారణకు రావాలన్న సిట్.. రాలేనని అమిత్ షాతో బెంగళూరుకి!

TSPSC Paper Leak Case: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌ కేసులో కీలక మలుపులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులతో పాటు ఆరోపణలు చేసిన వారికి కూడా సిట్ నోటీసులు ఇవ్వడం సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక ఆరోపణలు చేయగా.. వాటికి సంబంధించిన ఆధారాలతో ఈ నెల 26న విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే.. నేడు విచారణ ఉండగా అందుకు బండి సంజయ్ డుమ్మా కొట్టారు. అయితే.. విచారణకు తనకు బదులుగా బీజేపీ లీగల్ టీమ్‌‌ను పంపాలని బండి సంజయ్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే సిట్ అధికారులపై తనకు నమ్మకం లేదని.. నమ్మకం కలిగిన దర్యాప్తు సంస్థకు మాత్రమే తన దగ్గర ఉన్న ఆధారాలను అందిస్తానని.. సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో మాత్రమే విచారణ జరిపితే తన దగ్గర ఉన్న ఆధారాలను సమర్పిస్తానని బండి చెప్పుకొచ్చారు.

అదలా ఉండగానే సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన డేట్ రానే వచ్చింది. అయితే, బండి ఇదే రోజు మరో కార్యక్రమానికి వెళ్లనున్నారు. నేడు కర్ణాటకలోని బీదర్‌లో నిర్వహించనున్న అమిత్ షా సభకు బండ సంజయ్ హాజరుకానున్నారు. అందుకే సిట్ విచారణకు హాజరుకాలేకపోతున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. అక్కడ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేసిన వారికి సంబంధించి బీజేపీ ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి సభలో బండి సంజయ్ పాల్గోనున్నారు.

రెండు రాష్ట్రాల సరిహద్దులో ఈ కార్యక్రమం ఉంటుంది. అందువల్ల ఇందులో పాల్గొనడానికి సంజయ్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కాగా, టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నలుగురు నిందితులకు పోలీస్ కస్టడీ విధించారు. నిందితులకు నేటి నుంచి మూడు రోజుల పాటు సిట్ కస్టడీ అమలు కానుంది. ఈ కేసులో ప్రవీణ్ (ఏ1), రాజశేఖర్ (ఏ2), ఢాక్యా (ఏ4), కేతావత్ రాజేశ్వర్ (ఏ5)లను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు కోర్టు సిట్ కు అనుమతించింది. పేపర్ లీక్ కేసులో సిట్ ఇప్పటివరకు మొత్తం 13 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.