Covid19 Cases on Rise: దేశంలో మరోసారి అలజడి రేపుతున్న కరోనా.. హైఅలర్ట్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం!

Kaburulu

Kaburulu Desk

March 25, 2023 | 11:07 PM

Covid19 Cases on Rise: దేశంలో మరోసారి అలజడి రేపుతున్న కరోనా.. హైఅలర్ట్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం!

Covid19 Cases on Rise: మహమ్మారి కరోనా మానవాళికి చేసిన నష్టం అంతా ఇంతా కాదు. మనిషిని మనిషి తాకేందుకు కూడా భయపడేంతగా హడలెత్తించిన పరిస్థితులు తలచుకుంటే ఇప్పటికీ వెన్నులో వణుకు పుట్టక మానదు. మహమ్మారి మన మీద దండెత్తడం మొదలై మూడేళ్లు గడిచిపోయింది. ఈ మూడేళ్ళలో మళ్ళీ విజృంభించినట్లే ఇప్పుడు మళ్ళీ కేసులు పెరగడం మరోసారి ప్రజలలో ఆందోళన మొదలవుతుంది.

గత వారం కింద‌టి వ‌ర‌కు ప‌దుల సంఖ్య‌లో న‌మోద‌వుతున్న కేసులు తాజాగా వేల సంఖ్య‌కి చేరింది. దీంతో కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. ఈ విషయమై కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు హెచ్చరికాలు కూడా జారీ చేసింది. అంతే కాకుండా కరోనా వ్యాప్తి చెంద‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని రాష్ట్రాల‌కు సూచించింది. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనుంది. కరోనాపై అప్రమత్తమైన కేంద్రం సోమవారం రాష్ట్రాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనుంది. ఈ మేరకు కేంద్ర వైద్య శాఖ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి లేఖ రాసింది.

కేసుల ఉదృతిని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్‌ 10, 11వ తేదీల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా దేశంలో కొత్తగా 1590 కరోనా కేసులు నమోదుకాగా, వైరస్‌ కారణంగా ఆరుగురు మృతి చెందారు. 146 రోజుల తర్వాత ఒకే రోజు అత్యధిక కేసులు నమోదవడం ఇదే తొలిసారి కాగా తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,47,02,257కు చేరింది. ఇప్పటివరకు 5,30,824 మంది కరోనాకు బలయ్యారు.

ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఫోర్‌ ‘టీ’ (టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌-టీకా)పై దృష్టి పెట్టాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. కాగా, దేశంలో పెరుగుతున్న కేసులకు ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ XBB.1.16 సబ్‌వేరియంట్‌గా భావిస్తున్నారు. గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో భారీగా కేసులు వెలుగు చూస్తుండగా.. ఆయా రాష్ట్రాలలోనే గతంలో ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.