Paper Leakage Case: సారీ.. మీ మీద నాకు నమ్మకం లేదు.. సిట్ అధికారులకు బండి సంజయ్ లేఖ!

Kaburulu

Kaburulu Desk

March 24, 2023 | 01:13 PM

Paper Leakage Case: సారీ.. మీ మీద నాకు నమ్మకం లేదు.. సిట్ అధికారులకు బండి సంజయ్ లేఖ!

Paper Leakage Case: తెలంగాణ రాజకీయాలలో బర్నింగ్ ఇష్యు ఏదైనా ఉందంటే అది టీఎస్పీఎస్సి ప్రశ్నప్రత్రాల లీకేజీ కేసులో సిట్ విచారణ.. సిట్ ప్రతిపక్ష పార్టీల నేతలకిస్తున్న నోటీసులే. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు కథనాలొచ్చాయి. దీనిపై బండి సంజయ్ నేడు సిట్ అధికారులకు లేఖ రాశారు.

మీపై నాకు నమ్మకం లేదని లేఖలో చెప్పారు. తనకు నమ్మకం ఉన్న దర్యాప్తు సంస్థలకే తన వద్ద ఉన్న సమాచారం ఇస్తానని బండి సంజయ్ చెప్పారు. ఈ విషయమై తనకు స్వేచ్ఛ ఉందన్నారు. తనకు సిట్ నోటీసులు కూడా అందలేదని కూడా ఆ లేఖలో బండి సంజయ్ గుర్తు చేశారు. మీడియాలో వచ్చిన సమాచారం ఆధారంగా తాను ఈ విషయమై స్పందిస్తున్నట్టుగా బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ నెల 24న విచారణకు రావాలని మీడియాలో వార్తలు చూసినట్టుగా బండి సంజయ్ చెప్పారు.

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. ఈ నెల 24న నేను హాజరు కావాలని సిట్ కోరినట్లు మీడియా ద్వారానే తెలిసింది. అయితే పార్లమెంట్ సభ్యునిగా నేను సభకు హాజరు కావాల్సి ఉంది. నేను కచ్చితంగా హాజరుకావాలని అధికారులు భావిస్తే.. మరో తేదీ చెప్పాలని లేఖలో కోరారు.

పేపర్ లీకేజీపై ఆరోపణలు చేసిన బండికి సెక్షన్ 91 సీఆర్ పీసీ కింద సిట్ నోటీసులు జారీ చేసింది. సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గ్రూప్ 1 ప్రశ్నపత్రాల లీకేజీపై సంజయ్ చేసిన ఆరోపణలపై ఈనెల 21న పత్రికల్లో కథనం ప్రచురితమైనట్లు నోటీసుల్లో పేర్కొంది. పేపర్ లీకేజీపై చేసిన ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలని సిట్ పేర్కొంది. మార్చి 24వ తేదీన సిట్ ఎదుట హాజరవ్వాలని సంజయ్‎కు నోటీసుల్లో పేర్కొంది.