Minister KTR: ఇంత తెలివి లేని దద్దమ్మ అని అనుకోలేదు.. బండి సంజయ్ పై కేటీఆర్ విసుర్లు!

Minister KTR: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇంత తెలివి లేని దద్దమ్మ అనుకోలేదని తెలంగాణ మినిష్టర్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ వ్యవహారంపై బీజేపీ చేస్తున్న ఆందోళనలు, ధర్నాలు ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ఈ విమర్శలు చేశారు. టీఎస్పీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ అని.. అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం చాలా తక్కువగా ఉంటుందని బండి సంజయ్ కు తెలియదా అని మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు.
టీఎస్పీఎస్సీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఉండదనే విషయం కూడా తెలియకుండానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న బండి సంజయ్ మహా అజ్ఞాని అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బండి సంజయ్ తెలివి లేని దద్దమ్మ అనే విషయం మరోసారి రుజువయిందని అన్నారు. పభుత్వ వ్యవస్థల పనితీరు, వాటి పరిధులపై కనీస అవగాహన కూడా లేకుండా బండి సంజయ్ పార్లమెంట్ సభ్యుడు ఎలా అయ్యాడో అని విమర్శించారు.
స్వార్థ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా దిగజారిపోయి వాదనలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. భూరికార్డుల ప్రక్షాళన కోసం తీసుకొచ్చిన ధరణిపై కూడా ఆరోపణలు చేస్తున్నారని.. ధరణి పోర్టల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో ముడిపెట్టి తనపై అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికే పరువునష్టం కేసు ఎదుర్కొంటున్న బండి సంజయ్ కి బుద్ధి రాలేదని.. తనకు సంబంధం లేని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని.. ఇలాగే మాట్లాడితే క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉద్యోగ నియామక ప్రక్రియలో క్వశ్చన్ పేపర్లు లీకైన సందర్భాలు వందల్లో ఉన్నాయని.. వాటన్నిటికీ మోడీ సమాధానం చెప్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. గుజరాత్ లోనే గత 8 సంవత్సరాల్లో 13 సార్లు పేపర్ లీక్ అయిందని.. దీనికి ప్రధాని మోడీని బాధ్యుడిని చేసి రాజీనామాను డిమాండ్ చేయాలని సంజయ్ కు సవాల్ విసిరారు. బీజేపీ నేతలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని.. ముందు అది మానుకోవాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు.