West Godavari: ఆత్మహత్యాయత్నం చేసుకున్న కొడుకు.. కాపాడేందుకు ప్రాణ త్యాగం చేసిన తల్లి!

Kaburulu

Kaburulu Desk

March 17, 2023 | 11:01 PM

West Godavari: ఆత్మహత్యాయత్నం చేసుకున్న కొడుకు.. కాపాడేందుకు ప్రాణ త్యాగం చేసిన తల్లి!

West Godavari: తల్లి ప్రేమ గురించి కొత్తగా చెప్పేది ఏమీ ఉండదు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి తల్లి గురించి ప్రత్యేకంగా చెప్పుకొనే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నవమాసాలు మోసిన దగ్గర నుండి మన కోసం అన్నీ త్యాగం చేసి మనల్ని భూమ్మీదకి తీసుకొచ్చిన ఆ దేవత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిన్న తనంలో మనకి చిన్న గాయమైనా ఆ తల్లి మనసు గాయమవుతుంది. దాని అర్ధం తల్లి హృదయమే మనం. అందుకే బిడ్డ ప్రాణం మీదకి వస్తే ముందు తల్లి తన ప్రాణాన్ని అడ్డు పెడుతుంది.

కడుపున పుట్టిన బిడ్డలు ఎదిగొచ్చినా.. వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళు తల్లిదండ్రులైనా అమ్మకి బిడ్డపై ప్రేమ ఎన్నటికీ తగ్గదు. అందుకు నిదర్శనం ఈ ఘటన. తనపై కోపంతో ఆత్మహత్యయత్నం చేసుకునేందుకు రైలుకు ఎదురుగా వెళ్లిన కొడుకును కాపాడే ప్రయత్నం చేసింది ఓ తల్లి. ఈ క్రమంలో రైలు ఢీ కొట్టి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకరమైన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలం నవాబు పాలెం గ్రామానికి చెందిన బొండాడ అప్పారావు, సుబ్బమ్మ(65) దంపతులు. వీరికి వెంకటేశ్వరరావు(47) అనే కుమారుడు ఉన్నాడు. అతడు గతకొన్నేళ్లుగా మానసిక సమస్యతో బాధ పడుతున్నాడు. 12ఏళ్ల క్రితమై వెంకటేశ్వరావు భార్య, ఇద్దరు పిల్లలు ఆయన్ను వదిలి వెళ్లిపోగా అప్పటి నుంచి తల్లి సుబ్బమ్మ వద్దే వెంకటేశ్వరరావు ఉంటున్నాడు.

సుబ్బమ్మ అదే గ్రామంలో బట్టలు ఉతుకుతూ భర్త, కుమారుడిని పోషిస్తున్నారు. మానసిక స్థితి సరిగ్గాలేని వెంకటేశ్వరావు బుధవారం రాత్రి భోజనంలో కూర వేయలేదని తల్లిపై అలిగాడు. గురువారం ఉదయం కూడా ఇదే విషయంపై తల్లిపై కోప్పడి వెంకటేశ్వరరావు ఆత్మహత్య చేసుకొనేందుకు సమీపంలోని రైలు పట్టాల వైపు వెళ్లాడు. కుమారుడు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాడో అనే భయంతో తల్లి కూడా వెంకటేశ్వరావు వెనుక పరుగులు తీసింది.

అయితే, అప్పటికే రైలు వచ్చేసింది. కానీ వెనుక రైలు వస్తున్నా కూడా లెక్కచేయకుండా కుమారుడిని కాపాడాలని ఆ తల్లి ప్రాణాలకు తెగించి పట్టాలపై పరిగెత్తింది. రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్తున్న సింహాద్రి ఎక్స్ ప్రెస్ వెనుక నుంచి తల్లి కుమారుళ్లను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతిచెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరి మృతితో స్థానికంగా విషాదఛాయాలు అలుముకున్నాయి.