Sankranti 2023: వెండి కంచంలో 173 రకాల వంటలతో అల్లుడికి విందు.. వారెవ్వా లక్ అంటే నీదే బాసూ!
![Sankranti 2023: వెండి కంచంలో 173 రకాల వంటలతో అల్లుడికి విందు.. వారెవ్వా లక్ అంటే నీదే బాసూ!](https://kaburulu.com/wp-content/uploads/2023/01/Sankranti-2023.jpg)
Sankranti 2023: అతిధి మర్యాదలకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలు. మర్యాద అంటే.. గోదావరోళ్లు.. గోదావరోళ్లంటే మర్యాద అనేంతగా ఉంటుంది. వారు మాట్లాడే విధానం.. అతిథి మర్యాదల వరకు అన్నింటిలో కూడా వారి మర్యాద ఉట్టిపడుతుంది. ముఖ్యంగా మాటకు ముందు గారు, మాట తరువాత గారు అంటూ మర్యాదకు మారుపేరుగా నిలుస్తుంటారు. ఇక అల్లుళ్లకు గోదావరోళ్లు ఇచ్చే రెస్పెక్ట్ ఓ రేంజ్లో ఉంటుంది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇక ఈ మర్యాద పీక్స్ లెవల్కు వెళ్తుంది. ఇంటికొచ్చిన కొత్త అల్లుడిని రకరకాల భోజనాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంటారు.
ఈ సారి సంక్రాంతికి తమ ఇంటి కొత్త అల్లుడికి అత్తమామలు ఏకంగా 173 వంటకాలతో విందు భోజనం ఇచ్చారు. వివరాల్లోకెళ్తే.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన వ్యాపారవేత్త తటవర్తి బద్రి, సంధ్య దంపతులు ఈ ఘనమైన రీతిలో మర్యాదలు చేసి అల్లుడిని ఉక్కిరిబిక్కిరి చేశారు. అల్లుడు చవల పృథ్వీ గుప్తా, హారిక దంపతులకు పండుగ సందర్భంగా 173 రకాల వంటకాలతో భద్రి దంపతులు విందు భోజనం ఏర్పాటు చేశారు.
నిజానికి పృథ్వీ, హారికాలకు రెండేళ్ల క్రితమే పెళ్లయింది. అయితే.. మొదటి ఏడాది కొంత ఇబ్బంది రావటంతో పండగ నిర్వహించలేదు. రెండో ఏడాది కరోనా వల్ల నిలిపోయింది. దీంతో ఈ మూడో ఏడాది అసలు, వడ్డీ కలిపి వడ్డించారు అత్తారింటోళ్లు. అల్లుడిని సంక్రాంతికి ఆహ్వానించి, అరుదైన రీతిలో 173 రకాల పిండి వంటలతో మర్యాదలు చేసి అబ్బురపరిచారు. స్వయంగా అల్లుడికి వడ్డించి తమ ప్రేమను చాటుకున్నారు. వీరి ప్రేమను చూసి అల్లుడు ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. అతి కష్టం మీద.. అన్ని వంటకాలను రుచి చూశాడు.
ఇంకేముంది.. ప్రస్తుతం ఈ విందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు కొందరు ఏకంగా గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మర్యాద బాగుంటుందని కూడా ఆశ పడుతున్నారు.