MLC Election: సైకిలెక్కిన పట్టభద్రులు.. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ విజయం!

MLC Election: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా సాధారణ ఎన్నికల స్థాయిలో ఉత్కంఠ రేపాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరా పోటీ కనిపించింది. అయితే, ఒక్కో రౌండ్ పూర్తవుతుంటే ఫలితాలు ప్రతిపక్ష టీడీపీకి మెజార్టీగా కనిపించింది. ఏపీలో పట్టభద్రులకు జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాలలో ఇప్పటికే రెండు టీడీపీ సొంతం కాగా.. మరొకటి హోరాహోరీగా ఉత్కంఠగా సాగుతుంది.
ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాలలో పట్టభద్రులు సైకిలెక్కేశారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు కైవసం చేసుకోగా, తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ స్థానంలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. పశ్చిమ రాయలసీమ స్థానంలో మాత్రం హోరాహోరీ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో తేలకపోవడంతో రెండవ ప్రాధాన్యత లెక్కిస్తున్నారు.
ఉత్తరాంధ్ర స్థానంలో చిరంజీవిరావు విజయానికి అవసరమైన ఓట్లలో 90 శాతం తొలి ప్రాధాన్యత ఓట్లలో సాధించగా మిగిలిన 10 శాతం రెండో ప్రాధాన్యత ఓట్లు దక్కించుకున్నారు. విజయానికి 94,509 ఓట్లు అవసరం కాగా, తొలి ప్రాధాన్యంలో 82,958, రెండో ప్రాధాన్యంలో 11,551 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి సుధాకర్ టీడీపీ అభ్యర్థికి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోగా ఇద్దరి మధ్య భారీ తేడా కనిపించింది. ఇక ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీ, బీజేపీ అభ్యర్థి మాధవ్ సహా 34 మందికి డిపాజిట్లు కూడా దక్కలేదు.
ఇక తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల విషయానికి వస్తే ఇక్కడ టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలుపొందారు. రెండో ప్రాధాన్య ఓట్లతో కలిపి శ్రీకాంత్ 1,12,686 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి శ్యాంప్రసాద్రెడ్డికి 85,423 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటికే ఈ ఇద్దరి ఎన్నికను ఖరారు చేసిన అధికారులు డిక్లరేషన్ ఇచ్చారు. పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ స్థానంలో మాత్రం టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ సాగుతోంది. వైసీపీ బలపరిచిన వెన్నపూస రవీంద్రారెడ్డికి, టీడీపీ బలపరిచిన భూమిరెడ్డి రామగోపాల్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపుకు సరిపడిన ఓట్లు రానందువలన రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. తుది ఫలితాలు శనివారం సాయంత్రం లోపు వచ్చే అవకాశం ఉంది.