AP Govt: సలహాదారుల నియామకంపై విధాన రూపకల్పన.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం అదనపు అఫిడవిట్

Kaburulu

Kaburulu Desk

March 22, 2023 | 11:25 AM

AP Govt: సలహాదారుల నియామకంపై విధాన రూపకల్పన.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం అదనపు అఫిడవిట్

AP Govt: ఏపీ ప్రభుత్వం సలహాదారుల నియామకంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మొత్తం 45 మంది సలహాదారులున్నట్లు అంచనా కాగా వీరందరికీ విలాసవంతమైన వాహనం, బంగ్లా, వ్యక్తిగత సిబ్బంది, ఇతర విలాసవంతమైన సౌకర్యాలు కూడా ఇస్తున్నారు. అందులో 8 మంది సలహాదారులకు కేబినెట్ హోదా కూడా కల్పించారు. మరో 12 మంది సలహాదారులకు అధికారిక నివాసం, డ్రైవర్, పిఎ, పిఎస్, కార్యాలయంతో పాటు కేటగిరీ-1 పే-స్కేల్ (నెలకు రూ. 3.82 లక్షలు) ఇస్తున్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని వైసీపీ నేతలే ప్రకటిస్తుండగా.. సలహాదారుల పేరుతో ఇంత భారీ ఖర్చు చేయడంపై ప్రతిపక్షాలు అవకాశం దొరికిన ప్రతిసారి తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఇదే క్రమంలో దేవాదాయశాఖ సలహాదారు జ్వాలాపురపు శ్రీకాంత్, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి నియామకాల్ని సవాల్ చేస్తూ గతంలో హైకోర్టులో వేర్వేరుగా పిల్ దాఖలైంది. ప్రభుత్వానికి నచ్చిన వారికి సలహాదారులుగా నియమిస్తూ ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు.

దీనిపై హైకోర్టు అప్పుడే ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు శాఖలకు సలహాదారులు ఏంటని ప్రశ్నించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. ఇకపై మంత్రులకు మాత్రమే సలహాదారులను నియమిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. సలహాదారుల నియామకాలపై.. విధాన రూపకల్పన చేసేందుకు నిర్ణయం కూడా తీసుకున్నామని మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత జీవో విడుదల చేస్తామని న్యాయస్థానానికి వివరించింది.

అంతేకాదు, మంత్రులకు నియమించే సలహాదారులు కూడా అవినీతి నిరోధక చట్టంలోని పబ్లిక్ సర్వెంట్ నిర్వచనం కిందికి వస్తారని తెలిపింది. సలహాదారులు ప్రజావిధులు నిర్వహిస్తారని అందుకే వారు అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 2(సీ) ప్రకారం పబ్లిక్ సర్వెంట్ నిర్వచనం కిందికి వస్తారని తెలిపారు. ప్రభుత్వ రహస్య వివరాలు బహిర్గతం చేయబోమని సలహాదారుడు అఫిడవిట్ పై సంతకం చేయాల్సి ఉంటుందని.. విధానాల రూపకల్పనలో మంత్రులకు సలహాలు ఇవ్వడం వరకే సలహాదారుల పాత్ర పరిమితమని కోర్టుకు తెలిపింది.