Hyderabad: 16 మంది కార్యకర్తల అరెస్ట్.. జైలుకు తరలిస్తుండగా డ్రైవర్ కు ఫిట్స్.. సాహసం చేసి రక్షించిన ఎస్సై!

Hyderabad: ఓ పోలీస్ వ్యాన్ జైలు వైపు వెళ్తుంది. హోమ్ గార్డ్ ఆ వ్యాన్ కు డ్రైవర్ గా ఉన్నాడు. మొత్తం 16 మంది కార్యకర్తలను వ్యాన్ లో జైలుకు తరలిస్తున్నారు. వారికి రక్షణగా పోలీస్ సిబ్బందితో పాటు ఎస్సై కూడా వ్యాన్ లో ఉన్నారు. వ్యాన్ రోడ్ మీద వెళ్తుండగా డ్రైవర్ కు ఫిట్స్ వచ్చి స్టీరింగ్ మీద పడిపోయాడు. వ్యాన్ రోడ్ మీద అలాగే మెలికలు తిరుగుతూ వెళ్తూనే ఉంది. గమనించిన ఎస్సై వ్యాన్ నుండి బయటకు దూకి డ్రైవర్ వైపు డోర్ తెరుచుకొని స్టీరింగ్ గట్టిగా పట్టుకొని బ్రేక్ వేశాడు. అప్పటికే పెద్ద పూల కుండీని డ్యాష్ కొట్టి వ్యాన్ ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది.
వివరాల్లోకి వెళ్తే.. టీఎస్పీఎస్సి పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పలు దఫాలుగా ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు 16 మంది ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి డీసీఎం వ్యానులో ఎక్కించారు. వారికి కాపలాగా బంజారాహిల్స్కు చెందిన ఎస్సై కరుణాకర్రెడ్డి, పోలీసులు సిబ్బంది వ్యానులో కూర్చున్నారు.
కాగా, వారిని సైఫాబాద్ పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా ప్రసాద్ ఐమ్యాక్స్ సమీపంలోకి వచ్చేసరికి వాహనం నడుపుతున్న డ్రైవర్ కు ఫిట్స్ రావడంతో స్టీరింగ్పై వాలిపోయాడు. దీంతో వాహనం అదుపుతప్పి రోడ్డుపై అడ్డదిడ్డంగా పరుగులు తీస్తోంది. గమనించిన ఎస్సై కరుణాకర్రెడ్డి వెంటనే అప్రమత్తమై నడుస్తున్న వాహనం నుంచి కిందికి దూకి వాహనం ముందువైపుకు పరుగులు తీశారు. డ్రైవర్ కూర్చున్న డోర్ తెరిచి స్టీరింగ్ పట్టుకుని, బ్రేక్ వేశారు.
దీంతో వాహనం రోడ్డు పక్కనున్నపెద్ద పూలకుండీని ఢీకొట్టి ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని అక్కడి నుంచి తొలగించారు. అరెస్ట్ చేసిన వారిని మరో వాహనంలో తరలించారు. కాగా, ఘటనలో ఎస్సై కరుణాకర్రెడ్డితోపాటు హోంగార్డు రమేశ్, మరో కానిస్టేబుల్కు గాయాలవగా వారిని చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తరలించారు.