YSRTP: వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. భారీగా మోహరించిన పోలీసులు.. లోటస్ పాండ్ వద్ద హైటెన్షన్!

YSRTP: హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఉస్మానియా ఆసుపత్రికని బయలుదేరిన వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిలను పోలీసులు గేటు దగ్గరే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, షర్మిలకు మధ్య వాగ్వాదం జరిగింది. కనీసం తనను ఒక్కదాన్నైనా వెళ్ళనివ్వండని షర్మిల, పోలీసులను కోరారు. పోలీసుల వాహనంలో తీసుకెళ్లినా పర్వాలేదని వేడుకున్నారు. పోలీసులు మాత్రం అనుమతి లేదని నిరాకరించారు.
తాను కేవలం ఉస్మానియాలో ఉన్న రోగులను మాత్రమే పరమర్శిస్తానని షర్మిల స్పష్టం చేసినా.. వెళ్ళనివ్వద్దని పై అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయని పోలీసులు ఆమెకి వివరించారు. అయినా ఆమె వెళ్లాలని తెగేసి చెప్పడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. షర్మిలను హౌస్ అరెస్ట్ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం ఉదయం సమయానికే లోటస్ పాండ్ ఇంటివద్దకు భారీగా చేరుకున్న పోలీసులు ఆమెను బయటకు రాకుండా ఆంక్షలు విధించారు.
దీంతో షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగగా.. వైఎస్ఆర్టీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సమయంలో తోపులాటలో చిక్కుకున్న వైఎస్ షర్మిల కిందపడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై వైఎస్ షర్మిల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మీకు ఏం అధికారం ఉందని హౌజ్ అరెస్టు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఅర్ నియంత అని మరోసారి నిరూపణ అయ్యిందని, వైఎస్సార్ బిడ్డకు కేసీఅర్ భయపడుతున్నాడని సెటైరికల్ కామెంట్స్ చేశారు. అందుకే తనను ఆపుతున్నారని, ఇచ్చిన ఒక్క వాగ్ధానాన్నీ నిలబెట్టుకోలేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే జనతా రైడ్ కి పిలుపు నిచ్చామన్న షర్మిల.. ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలని అనుకున్నామని తెలిపారు. అందులో భాగంగానే ఇయ్యాళ ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళాలని అనుకున్నామని చెప్పారు. తాను ఒక్క దాన్ని మాత్రమే వస్తానని, దమ్ముంటే అనుమతి ఇవ్వండి అంటూ సవాల్ విసిరారు.