YSRTP: షర్మిల దీక్ష భగ్నం.. దీక్షకు అనుమతి లేదని అరెస్ట్ చేసిన పోలీసులు!

YSRTP: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ట్యాంక్ బండ్ రోడ్డుపై దీక్షకు దిగిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. మంగళవారం మహిళా దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్పై రాణి రుద్రమ, చాకలి ఐలమ్మ విగ్రహాలకు నివాళి అర్పించారు. అనంతరం రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ట్యాంక్ బండ్ రోడ్డుపై దీక్షకు దిగారు.
తొలుత విగ్రహానికి నివాళులర్పించిన షర్మిల తర్వాత రాణి రుద్రమ విగ్రహం వద్దనే తాను సాయంత్రం వరకూ దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. షర్మిల దీక్ష, సంఘీభావంగా వచ్చిన ప్రజలు, ఆమె అనుచరులతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో అక్కడ దీక్షకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు ఆమెను బలవంతంగా అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు.
అంతకు ముందు మీడియాతో మాట్లాడిన షర్మిల.. రాష్ట్రంలో కేసీఆర్కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు తప్ప ఎవరికీ భద్రత లేదన్నారు. విచ్చలవిడి మద్యం వల్లే రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని, దీనిపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత బతుకమ్మ ముసుగులో లిక్కర్స్కామ్కు పాల్పడిందని ఆరోపించారు. మహిళల మీద ఎంతో ప్రేమ ఉన్నట్లు మహిళా రిజర్వేషన్ల కోసం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.