YSRTP: ఢిల్లీలో షర్మిల చలో పార్లమెంట్ ర్యాలీ.. అనుమతి లేదని అరెస్ట్ చేసిన పోలీసులు!

YSRTP: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలను ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ‘చలో పార్లమెంట్’ ర్యాలీకి అనుమతి లేదంటూ షర్మిలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరపాలంటూ షర్మిల ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఈ రోజు పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా చేశారు.
ముందుగా అక్కడ మీడియాతో మాట్లాడిన షర్మిల.. తర్వాత జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీ చేపట్టారు. పార్టీ నేతలతో కలిసి నినాదాలు చేసుకుంటూ మందుకు సాగారు. అయితే, చలో పార్లమెంటు కార్యక్రమానికి అనుమతి లేదని షర్మిలకు తెలిపిన పోలీసులు.. షర్మిలతో పాటు ఆమె వెంట ఉన్న కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇక అంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని కేంద్రానికి షర్మిల పిలుపునిచ్చారు. అలాగే సీబీఐతో విచారణ జరిపించాలని ఆమె కోరారు. అయితే ఆమె ఫిర్యాదుపై అధికారులు స్పందించకపోవడంతో షర్మిల ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లిన షర్మిల జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించి.. పార్లమెంట్ వైపు వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు తనను అరెస్ట్ చేయడంపై షర్మిల అసహనం వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన భారీ అవినీతి గురించి దేశవ్యాప్తంగా చర్చ జరగడం కోసమే తాము నిరసన కార్యక్రమం చేపట్టామని షర్మిల చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం బీఆర్ఎస్ నేతలు, కొంతమంది కాంట్రాక్టర్ల కమీషన్ల కోసమే కట్టారని షర్మిల ఆరోపించారు. రీ డిజైనింగ్ పేరుతో ప్రాజెక్టు ఖర్చును మూడింతలు పెంచి.. తమకి కావాల్సిన వారికి కేసీఆర్ ప్రభుత్వం దోచిపెట్టారని షర్మిల ఆరోపిస్తున్నారు.
#WATCH | YSRTP chief YS Sharmila detained by police during a protest against Telangana's KCR government in Delhi. She has alleged irregularities in Kaleshwaram Lift Irrigation Project pic.twitter.com/upmfSUqTLz
— ANI (@ANI) March 14, 2023