YSRTP: పిట్లంలో పిట్టకథలు చెప్పిన పిట్టలదొర కొడుకు కేటీఆరా.. షర్మిల ఘాటు విమర్శలు!

Kaburulu

Kaburulu Desk

March 16, 2023 | 10:35 PM

YSRTP: పిట్లంలో పిట్టకథలు చెప్పిన పిట్టలదొర కొడుకు కేటీఆరా.. షర్మిల ఘాటు విమర్శలు!

YSRTP: తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం కూడా మరింత హీటెక్కిస్తోంది. అధికార పార్టీపై ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నేతలు గురిపెట్టి విమర్శలు చేస్తుండగా.. ఇప్పుడు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా పిట్లంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా షర్మిల ఓ రేంజిలో మండిపడ్డారు.

పిట్లంలో పిట్టకథలు చెప్పిన పిట్టలదొర కొడుకా కేటీఆర్..అంటూ మంత్రి కేటీఆర్ పై విమర్శల బాణాలు సంధించారు. తెలంగాణను రోకలిబండతో కొట్టి చంపింది ఎవరు? అంటూ షర్మిల ప్రశ్నించారు. 33 ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణ బీడు భూములకు నీళ్లు పారించినందుకు తెలంగాణను వైఎస్సార్ రోకలిబండతో కొట్టినట్టా? అని నిలదీశారు. రుణమాఫీ, ఉచిత విద్యుత్, సబ్సిడీలు ఇచ్చి వ్యవసాయాన్ని పండుగ చేసినందుకు కొట్టి చంపినట్టా? ఆరోగ్య శ్రీ, పక్కా ఇళ్లు, ఫీజు రీయింబర్స్ మెంట్, లక్షల కొద్దీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. ఇవన్నీ కూడా ప్రజలను కొట్టి చంపినట్టేనా? అని ప్రశ్నించారు.

నిజానికి తెలంగాణను రోకలిబండతో కొట్టి చంపుతున్నది నీ అయ్య ‘కసాయి రావే’. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని నీ కుటుంబం కోసం నాలుగున్నర లక్షల కోట్లు అప్పు చేసి చంపేసిన మాట నిజం కాదా? ఇంటికో ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగులను, రుణమాఫీ అని రైతులను చంపుతున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఫీజులు చెల్లించక విద్యార్థులను, పోడు పట్టాలు ఇస్తామని గిరిజన బిడ్డలను కొట్టి చంపుతున్నది నీ అయ్య కసాయి రావే కదా అని చురకలు అంటించారు.

తెలంగాణలో ప్రతిపక్షాలు గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతుంటే.. తెలంగాణను దర్జాగా దోచుకుంటున్న దొంగలు మీరు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు కాజేసింది మీరు. మీ అక్రమాలకు అడ్డొస్తే, ప్రశ్నిస్తే చావగొట్టేది మీరు. తల్లి లాంటి తెలంగాణను చంపుతున్న అసలు కసాయి గూండాలు మీరే. ఈసారి ఓటు కోసం కాలు బయటపెట్టి చూడు.. నీకు, నీ అయ్యకు ఆ రోకలిబండే సమాధానం అంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.