BRS MLC Kavitha: ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత దీక్షను ప్రారంభించిన సీతారాం ఏచూరి!

Kaburulu

Kaburulu Desk

March 10, 2023 | 11:46 AM

BRS MLC Kavitha: ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత దీక్షను ప్రారంభించిన సీతారాం ఏచూరి!

BRS MLC Kavitha: దేశవ్యాప్తంగా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ అమలు చేయాలనే డిమాండ్‌తో భారత జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వేదికగా నిరసన దీక్ష చేపట్టారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా దీక్ష కొనసాగనుండగా.. ఎమ్మెల్సీ కవితతో పాటు సుమారు 500 మంది ఈ దీక్షలో కూర్చున్నారు.

దేశంలోని 29 రాష్ట్రాల నుండి మహిళల హక్కుల కోసం పోరాడుతున్న వివిధ మహిళా సంఘాలు, పలు పార్టీల నేతలు కూడా ఈ దీక్షకు హాజరుకానున్నట్లు తెలుస్తుంది. కాగా కవిత నిరసన దీక్షకు దేశవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 18 పార్టీల ప్రతినిధులు సంఘీభావం ప్రకటించగా.. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ ఉదయం ఎమ్మెల్సీ కవితచే దీక్షను ప్రారంభింపజేశారు. ఇక తెలంగాణకు చెందిన మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సీతా దయాకర్ రెడ్డి కూడా కవితతో పాటు దీక్షలో కూర్చున్నారు.

ముందుగా స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసిన ఆమె.. ఆ తర్వాత దీక్షా స్థలి దగ్గర కూర్చున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం ద్వారా మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ లభిస్తుందనీ.. ఇప్పటివరకూ అలా జరగట్లేదని బీఆర్ఎస్ ఈ దీక్షకు పూనుకున్నట్లు చెప్తుంది. కాగా, సాయంత్రం 4 గంటలకు దీక్ష సీపీఐ కార్యదర్శి డీ రాజా దీక్షను ముగించనున్నారు.

దీక్ష ప్రారంభించిన సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. భారత జాగృతి సంస్థకు అండగా ఉంటామని.. మూడు దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్లపై చర్చ జరగకపోవడం బాధాకరమన్నారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. 1996లో దేవేగౌడ హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినా చట్టం కాలేదని.. 27 ఏళ్లుగా బిల్లు పెండింగ్‌లో ఉందని.. బీజేపీ రెండుసార్లు హామీ ఇచ్చి వదిలేసిందన్నారు. బీజేపీ తన హామీని కార్యరూపంలోకి తేవాలని.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పారు.