Viveka Murdere Case: విచారణలో ఉత్కంఠ.. సీబీఐ విచారణ జరుగుతుండగానే అవినాష్ అరెస్టుపై కోర్టు ఉత్తర్వులు!

Kaburulu

Kaburulu Desk

March 10, 2023 | 05:58 PM

Viveka Murdere Case: విచారణలో ఉత్కంఠ.. సీబీఐ విచారణ జరుగుతుండగానే అవినాష్ అరెస్టుపై కోర్టు ఉత్తర్వులు!

Viveka Murdere Case: సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ సినిమాలను మించేలా తీవ్ర ఉత్కంఠగా సాగుతుంది. ఇప్పటికే రెండుసార్లు విచారించిన ఎంపీ వైఎస్ అవినాష్ ను సీబీఐ ఈరోజు మరోసారి విచారించింది. విచారణ ముగిసిన అనంతరం అవినాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను విచారణ కోసం ఈ ఉదయం 10.30 గంటలకే సీబీఐ కార్యాలయానికి వచ్చానని, ఉదయం 11.00 గంటల నుంచి ఒంటి గంట వరకు తనను విచారించారని వెల్లడించారు.

ఆ తర్వాత కోర్టు నుంచి పిలుపు వచ్చిందని సీబీఐ విచారణ అధికారి కోర్టుకు వెళ్లారని, తనను సీబీఐ కార్యాలయంలోనే ఉండాలని చెప్పారని అవినాశ్ రెడ్డి వివరించారు. సీబీఐ అధికారి కోర్టు నుంచి వచ్చి.. ఇవాళ్టికి విచారణ ముగిసిందని చెప్పారని, తాము పిలిచినప్పుడు మరోసారి రావాలని అన్నారని తెలిపారు. కాగా, అవినాష్ సీబీఐ కార్యాలయంలో విచారణ ఎదుర్కొంటుండగానే తెలంగాణ హైకోర్టు నుండి అరెస్టుపై కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి.

వివేకా హత్య కేసులో సీబీఐ తనపై తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. అవినాశ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి అవినాశ్ రెడ్డిని సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. కేసు పూర్తి వివరాలు సోమవారం సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.

కాగా, అవినాష్ కోరినట్లుగానే కేసు విచారణను వీడియో రికార్డింగ్ చేస్తున్నామని సీబీఐ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అందుకు కోర్టు స్పందిస్తూ.. వీడియో రికార్డింగ్ ఏ దశలో ఉందో చెప్పాలని సీబీఐని ఆదేశించింది. పిటిషనర్ కోరినట్లుగా ఎందుకు ఆదేశించకూడదో కూడా సీబీఐ కోర్టుకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో సోమవారం సీబీఐ కోర్టుకు ఏం చెప్పనుంది? సోమవారం కోర్టు ఏ ఆదేశాలు ఇవ్వనుంది? సీబీఐ తదుపరి అవినాష్ ను ఎప్పుడు విచారణకి పిలవనుంది అన్నది ఆసక్తి కరంగా మారింది.