Viveka Murder Case: సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని కోర్టులో ఎంపీ అవినాష్ రిట్ పిటిషన్!

Kaburulu

Kaburulu Desk

March 9, 2023 | 04:41 PM

Viveka Murder Case: సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని కోర్టులో ఎంపీ అవినాష్ రిట్ పిటిషన్!

Viveka Murder Case: సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్యకేసు ఇప్పుడు తీవ్ర ఉత్కంఠగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ రెండుసార్లు విచారించిన సంగతి తెలిసిందే. కాగా, ఈనెల 10న అంటే రేపే మరోసారి విచారణకి రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఎంపీ అవినాష్ తో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎంపీ అవినాష్ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చారు కాబట్టి అరెస్టు చేయొద్దని, విచారణ మొత్తం వీడియో రికార్డ్ చేయాలని అవినాష్ రెడ్డి కోరారు. అలాగే తన న్యాయవాది సమక్షంలోనే విచారించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. సీఆర్పీసీ 160 అంటే కేవలం విచారణ నిమిత్తమే కనుక.. అది తన న్యాయవాది సమక్షంలో జరగాలని తాను కోరుకుంటున్నానని అవినాష్ పిటిషన్ లో పేర్కొన్నారు.

అలాగే, ఈ హత్య కేసులో ఏ4గా ఉన్న దస్తగిరిని సీబీఐ ఇప్పటి వరకు అరెస్ట్‌ చేయలేదన్న అవినాష్‌.. దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడా సీబీఐ వ్యతిరేకించాలన్నారు. దస్తగిరి చెప్పిన మాటల ఆధారంగా సీబీఐ విచారణ కొనసాగుతోందని ఆరోపించిన ఎంపీ అవినాష్‌.. తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాధారాలు లేకపోయినప్పటికీ.. కేసులో తనను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. వివేక హత్య కేసులో దర్యాప్తు అధికారి తీరు పారదర్శకంగా లేదని అవినాష్‌ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

కాగా, రేపు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకానున్న విషయం తెలిసిందే. అవినాష్ రెడ్డిని సిబిఐ మూడోసారి విచారణకు పిలిచిన నేపథ్యంలో ఈసారి అరెస్టు చేయడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అవినాష్ రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ కేసుపై మరింత ఉత్కంఠ పెరిగింది. మరి రేపు పరిస్థితి ఎలా ఉంటుందన్నది చూడాలి!