Gun Fire: పులివెందులలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి.. తెగబడిన వ్యక్తి ఎంపీ అవినాష్ అనుచరుడిగా ప్రచారం!

Gun Fire: నిన్న మొన్నటి వరకు కడప జిల్లా అంటేనే టక్కున గుర్తొచ్చేది ఫ్యాక్షన్. పలు సినిమాల్లో కూడా సీమ ఫ్యాక్షన్ గొడవలను భూతద్దంలో చూపించిన ఘటనలు, గతంలో జరిగిన కొన్ని అనుభవాలు ఈ ముద్ర పడడానికి కారణంగా చెప్పవచ్చు. అయితే కాలం మారింది, ఫ్యాక్షన్ పూర్తిగా మాసిపోయిందని పోలీసులు పదేపదే చెబుతుంటారు. కానీ నేటికీ జిల్లాలో గన్ కల్చర్ కొనసాగుతూనే ఉంది. తాజాగా కడప జిల్లా పులివెందులలో కాల్పుల మోత మోగింది.
భరత్ కుమార్ అనే వ్యక్తికి దిలీప్ అనే వ్యక్తి గొడవ జరిగినట్లు తెలిసింది. గొడవ ఘర్షణగా మారడంతో భరత్ దిలీప్ తో పాటు మరొకరిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో దిలీప్, మహబూబ్ భాషా గాయపడ్డారు. వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో దిలీప్ అనే వ్యక్తి చనిపోయినట్టు తెలుస్తోంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందితుడు భరత్ కుమార్ కోసం గాలిస్తున్నారు.
భరత్ కుమార్ యాదవ్, పులివెందుల పట్టణంలోని గొర్రెల వ్యాపారి దిలీప్ మధ్య ఆర్థికలావాదేవీలు ఉన్నాయి. గత వారం రోజులుగా ఇద్దరూ డబ్బుల విషయంలో గొడవపడుతున్నట్టు సమాచారం. దిలీప్, భరత్ కుమార్ యాదవ్ కు అప్పు ఉండటంతో ఆ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పులివెందులలోని వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఈరోజు మధ్యాహ్నం ఇద్దరూ తీవ్రస్థాయిలో ఘర్షణకు దిగడంతో.. హుటాహుటిన ఇంట్లోకి దూసుకెళ్లిన భరత్ తనవద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. దిలీప్ ఛాతి, నుదిటిపై కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది
అయితే భరత్ కుమార్, దిలీప్ మధ్య ఆర్థిక వివాదాలు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇందుకు సంబంధించి వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంలో భరత్ తన వెంట తెచ్చిన తుపాకీతో కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడిన మహబూబ్ బాషా మీడియాతో మాట్లాడారు. భరత్ కుమార్ యాదవ్ ఐదు రౌండ్లు కాల్చాడని వెల్లడించాడు.
ఇక కాల్పుల ఘటనలో నిందితుడైన భరత్ కుమార్ యాదవ్ను గతంలో వివేకా హత్యకేసులో సీబీఐ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. వివేకా హత్య కేసులో నిందితుడైన సునీల్ కుమార్ యాదవ్కు భరత్ కుమార్ యాదవ్ సమీప బంధువు అని తెలుస్తోంది. అలానే వివేకా కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ కు భరత్ అనుచరుడిగా ప్రచారం జరుగుతుంది.