Somu Veerraju: వివేకా కేసులో ఎవరినీ కాపాడేది లేదు.. సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!

Kaburulu

Kaburulu Desk

February 27, 2023 | 03:45 PM

Somu Veerraju: వివేకా కేసులో ఎవరినీ కాపాడేది లేదు.. సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!

Somu Veerraju: ఏపీలో ఇప్పుడు కాకరేపుతున్న టాపిక్ ఏదైనా ఉందంటే అది వైఎస్ వివేకా హత్యకేసు మాత్రమేనని చెప్పుకోవాలి. అధికార, ప్రతిపక్షాల నుండి ప్రభుత్వ వర్గాల వరకూ ఎక్కడ విన్నా ఈ హత్యకేసు పైనే చర్చలు జరుగుతున్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ ఎంపీ అవినాష్ రెడ్డిని, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని విచారణకి పిలవడం.. ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలకు దిగడం.. వైసీపీ నేతలు సీబీఐపై విమర్శలు, టీడీపీ నేతలపై విమర్శలు ఇలా ఎటు చూసినా ఈ హత్యకేసే వినిపిస్తుంది.

తాజాగా, ఈ కేసుపై స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ.. వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్రం జోక్యం ఉండదని స్పష్టం చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన సోము.. కేంద్రం ఎవరినీ కాపాడే ప్రయత్నం చేయదని.. ఎవరినైనా కాపాడాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ నేతల అవినీతి కనిపించకుండా ఏదో ఒక ఇష్యూపైకి దృష్టి మళ్లించి రాజకీయం చేస్తున్నారన్నారు.

రాష్ట్రంలో వనరులను రెండు పార్టీలు దోచేస్తున్నాయని.. 60:40 అంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు పంచుకుంటున్నాయన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన విధంగానే నేడు వైసీపీ ప్రభుత్వం అవినీతి రాజకీయాలు చేస్తున్నాయన్నారు. వాళ్లకు సహకరించకుంటే వేయి కోట్లు ప్యాకేజి అంటూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. చైనాను లొంగదీసుకున్న బీజేపీకి, వీళ్లంతా ఓ లెక్కా అని సోము ప్రశ్నించారు.

ఇక, ఎమ్మెల్సీ ఎన్నికలకు తిరుపతిలో దొంగ ఓట్లను నమోదు చేయించారని సోము వీర్రాజు ఆరోపణలు గుప్పించారు. బీజేపీ ఏపీలో ఎవరికీ ఏజెంట్‌గా పనిచేయదన్న ఆయన.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి తీరుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక, కన్నా లక్ష్మీనారాయణ పార్టీ ఫిరాయింపు సోము వలనేనని.. అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయని ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన సోము తనపై మా పార్టీ నేతలు ఎవరూ అధిష్టానానికి ఫిర్యాదు చేయలేదని.. మీకు మీరే రాసుకొని.. మీరే వచ్చి అడుగుతున్నారని మీడియాపై ఆరోపణలు చేశారు.