YS Sharmila: ఒక్క విగ్రహాన్ని కూల్చితే.. వెయ్యి విగ్రహాలు పెడతాం.. బీఆర్ఎస్ నేతలపై షర్మిల విసుర్లు!

YS Sharmila: మీరు ఒక్క విగ్రహాన్ని కూల్చితే.. మా కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు వెయ్యి విగ్రహాలు పెడతారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బీఆర్ఎస్ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పాలకుర్తిలో షర్మిల పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కూల్చివేయడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విగ్రహాన్ని కూల్చేశారని షర్మిల ఆరోపించారు. విగ్రహం కూల్చివేతకు మూల్యం తప్పదన్నారు.
అవుతాపూర్ లో వైఎస్ఆర్ విగ్రహాన్ని కూల్చడం నీచమైన చర్య అంటూ మండిపడిన షర్మిల.. ️బీఆర్ఎస్ గూండాలు అర్థరాత్రి విగ్రహాన్ని కూల్చివేశారని ఆరోపించారు. ️ దయలేని దయాకర్ రావు దగ్గరుండి మరీ ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపించారు. విగ్రహాన్ని పడగొట్టిన గూండాలకు నాయకుడు ఈ ఎర్రబెల్లినే అన్నారు. స్వయంగా మహిళలు చందాలు వేసుకొని కట్టించిన విగ్రహంపై.. మొదటి నుంచే మంత్రికి కన్ను ఉందని.. ఆ రోజే విగ్రహ ఏర్పాటు అడ్డగించేందుకు శతకోటి ప్రయత్నాలు చేశాడని ఆరోపించారు.
అప్పుడు విగ్రహ ఏర్పాటులో ముందుండి నిలబడ్డ మహిళలకు పథకాలు బంద్ పెడతానని బెదిరింపులకు గురిచేశాడని.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా విగ్రహం నిలిచేసరికి మంత్రికి నిద్రపట్టలేదు. ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న వైఎస్ఆర్ అభిమానాన్ని తట్టుకోలేకపోయిన మంత్రి.. అర్థరాత్రి గూండాలను పెట్టి జేసీబీలతో ధ్వంసం చేయించాడని ఆరోపించారు. ఎర్రబెల్లి ఖబడ్దార్.. నువ్వు మంత్రివా.. కంత్రీవా.. అభివృద్ధిపై బహిరంగ చర్చకు వచ్చే దమ్ములేక విగ్రహాల మీదనా నీ రాజకీయం అంటూ ఆగ్రహించారు.
అంతేకాదు, పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్లు కట్టుడు చేతకాలేదని.. కనీసం డిగ్రీ కాలేజీ కూడా తెచ్చుకోలేని అసమర్థ మంత్రివి నువ్వని షర్మిల విమర్శించారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉండి, బీరు బాటిళ్లు, బ్రాందీ బాటిళ్లు అమ్ముకో అని చెప్పిన సన్నాసి నువ్వు.. చదువు, సంస్కారం లేని వ్యక్తిని మంత్రిని చేస్తే.. విగ్రహాలను పడగొట్టడం మీదున్న సోయి అభివృద్ధి మీద ఎక్కడుంటది? నువ్వు మంత్రివే అయితే.. నీ పేరులో దయ ఉంటే వెంటనే వైఎస్ఆర్ విగ్రహాన్ని పెట్టించి నీ నిజాయతీ నిరూపించుకో అని వరస ట్వీట్లు చేశారు.