Q News: చర్లపల్లి జైలుకి తీన్మార్ మల్లన్న.. రిమాండ్ రిపోర్టులో 8 మంది.. టీమ్‌పై రెండు ఘటనల్లో కేసులు

Kaburulu

Kaburulu Desk

March 22, 2023 | 11:15 PM

Q News: చర్లపల్లి జైలుకి తీన్మార్ మల్లన్న.. రిమాండ్ రిపోర్టులో 8 మంది.. టీమ్‌పై రెండు ఘటనల్లో కేసులు

Q News: తీర్మాన్ మల్లన్నను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. నిన్న రాత్రి తీన్మార్ మల్లన్న సహా ఐదుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, వారిని హయత్‌నగర్ కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా కోర్టు వారిని రిమాండ్‌కు ఆదేశించింది. దీంతో నిందితులను చర్లపల్లికి జైలుకు తరలించారు. పోలీసులను కిడ్నాప్ చేసి ఆపై దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న తీన్మార్ మల్లన్న ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.

హయత్‌నగర్ మునుగానూర్ ద్వారక నగర్‌లోని మేజిస్ట్రేట్ ఇంటి వద్ద తీన్మార్ మల్లన్న సహా.. మరికొందరిని పోలీసులు హాజరుపరిచగా.. విచారణ జరిపిన జడ్జ్ మల్లన్నకు 14రోజుల రిమాండ్ విధించారు. దీంతో మల్లన్నతో పాటు మరో నలుగురిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా, తీన్మార్ మల్లన్నపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని.. ఈ ప్రభుత్వం ప్రజా గొంతును నొక్కే ప్రయత్నం చేస్తోందని మల్లన్న భార్య మమత విమర్శించారు. ఈ రోజు ఉదయం నుంచి పోలీసులు మల్లన్నను పలు పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ తనను కలవనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, ఈ కేసులో 8 మంది నిందితులుగా ఉన్నట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వీరిలో ఇప్పటికే ఆరుగురు అరెస్ట్ కాగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు వెల్లడించారు. మల్లన్న టీంపై మొత్తం రెండు ఘటనల్లో కేసు నమోదైనట్టు తెలిపారు. ఎస్ఓటీ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్లన్న టీమ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. 148, 307, 342,506, 384, 109, r/w 149కింద కేసులు ఫైల్ చేశారు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్స్ ను కిడ్నాప్ చేసి దాడి చేసినట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు.

ఫిర్జాదీగూడ, రాఘవేంద్ర భవన్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులను అడ్డుకున్నారన్నారు. అంతేకాదు పోలీసులను Q న్యూస్ ఆఫీస్ కి తీసుకెళ్లి దాడి చేశాని, చైన్ స్నాచర్ల కోసం వెహికల్ చెకింగ్ చేస్తుండగా పోలీసులను నిలదీశారని తెలిపారు. మీరు ఎవరు, ఎందుకు వాహనాలు చెక్ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారని చెప్పారు. మీ ఐడీ కార్డు చూపించాలని పోలీసులతో గొడవ పడ్డారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు.