AP Temples Ticket Rates: భారీగా పెరిగిన తలనీలాల టికెట్ల ధరలు.. ఏకంగా 60 శాతం పెంపు!

AP Temples Ticket Rates: ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ హిందూ దేవాలయాలకి వెళ్లే భక్తులకు మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే దర్శనాలకు సంబంధించిన టికెట్లను భారీగా పెంచిన ప్రభుత్వం.. తాజాగా తాననీలాలకు సంబంధించిన టికెట్లను కూడా భారీగా పెంచింది. దేవాలయాలలో కేశఖండనకు ఇప్పటి వరకు రూ.25గా ఉన్న టిక్కెట్లను 60 శాతం పెంచి రూ.40 చేసింది. అయితే, పెంచిన మొత్తాన్ని తలనీలాలు తీసే క్షురకులకు చెల్లించాలని ఆదేశించింది.
ప్రస్తుతం రూ. 25గా ఉన్న కేశఖండన టికెట్ ధరను రూ. 40కి పెంచిన ఏపీ ప్రభుత్వం తలనీలాల విధులు నిర్వర్తించే క్షురకులకు నెలకు కనీసం రూ. 20 వేల చొప్పున కమిషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు దేవాదాయశాఖ ఇన్చార్జ్ ముఖ్యకార్యదర్శి ఎం.హరిజవహర్లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ద్వారా తలనీలాల విధులు నిర్వర్తించే ప్రతి క్షురకుడికి నెలకు కనీసం రూ. 20 వేల చొప్పున చెల్లించనున్నారు.
ఇప్పటి వరకు భక్తుల నుంచి వసూలు చేస్తున్న రూ. 25 ద్వారా వచ్చే ఆదాయాన్ని క్షురకులకు ఇస్తుండగా.. అది సరిపోవడం లేదని చాలా కాలంగా వారు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు తమకు కూడా రెగ్యులర్ ఉద్యోగుల్లానే కనీస వేతనం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం ప్రకారం పెంచిన టికెట్ ధర రూ. 40 ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని క్షురకులకే ఇస్తారు.
రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే ఆలయాల్లో మొత్తం కేశఖండన విధులు నిర్వర్తించే క్షురకులు 1,100 మంది ఉండగా.. తలనీలాల టికెట్లపై వచ్చే ఆదాయాన్ని ప్రతి ఆలయంలోని క్షురకులందరికీ సమానంగా పంచుతారు. ఒకవేళ రూ.20 వేల వేతనానికి అవి సరిపోకపోతే.. తలనీలాల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయం నుండి చెల్లించాలి. ఒకవేళ అవి కూడా సరిపోకపోతే ఆలయ ఆదాయంలో మూడు శాతం వినియోగం.. అప్పటికీ సరిపోకుంటే కమిషనర్ ద్వారా ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.