Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి బిగ్ షాక్.. అరెస్ట్ చేయొద్దని చెప్పలేమన్న హైకోర్టు!

Viveka Murder Case: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ అరెస్ట్ చేయొద్దని చెప్పలేమని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు, సీబీఐ దర్యాప్తుకు సహకరించాలని కూడా ఆదేశించింది. వివేకా హత్య కేసులో తనపై సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని అవినాష్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన విచారణలో ఆడియో, వీడియో రికార్డ్ చేయాల, న్యాయవాదిని అనుమతించాలని పిటీషన్ దాఖలు చేశారు.
ఈ పిటీషన్ పై రెండు రోజుల క్రితమే విచారణ జరిపిన హైకోర్టు.. అప్పటికి అరెస్ట్ చేయకుండా స్టే ఇచ్చింది. విచారణకు మాత్రం ఒకే చెప్పింది. ఎందుకు అరెస్ట్ చేయాలో చెప్పాలని సీబీఐని కోరింది. దీంతో నేడు ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించలేమని పేర్కొంది. ఈ కేసు దర్యాఫ్తును కొనసాగించవచ్చునని సీబీఐకి అనుమతిస్తూ విచారణను ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇక, విచారించే చోటుకు న్యాయవాదిని అనుమతించలేమని కూడా వెల్లడించిన కోర్టు.. విచారణకు సహకరించాలని అవినాశ్ రెడ్డిని ఆదేశించింది. కేసు దర్యాప్తు చివరి దశకు చేరుకోవడంతో ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిని సైతం అరెస్టు చేస్తారని ప్రచారం మొదలైన తరుణంలో అవినాష్ కోర్టుకెళ్లారు. అయితే, ఇప్పుడు కోర్టు తామేం చేయలేమని చెప్పేసింది. ఈ క్రమంలో సీబీఐ నెక్స్ట్ ఏం చేయబోతుందన్నది ఉత్కంఠగా మారింది.
దీంతో..ఇప్పుడు సీబీఐ మరోసారి అనివాష్ ను విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది. అవినాష్ విచారణకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సీబీఐ విచారణ సందర్భంగా అందించగా.. అందులో 10 డాక్యుమెంట్లు, 35 మంది సాక్షుల వాంగ్మూలాలు, కొన్ని ఫొటోలను కోర్టుకు సమర్పించింది. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన లెటర్, ఎఫ్ఎస్ఎల్ నివేదికను కూడా హైకోర్టుకు సీబీఐ అందజేసింది. అవినాష్ పిటిషన్ కొట్టేసిన కోర్టు వాటిని తిరిగి సీబీఐకి అప్పగించింది.