Global Investors Summit 2023: సమ్మిట్కు సర్వం సిద్ధం.. అందరూ ఆహ్వానితులేనన్న సీఎం జగన్!

Global Investors Summit 2023: అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న గ్లోబల్ ఇన్వెస్టింగ్ సమ్మిట్ కు వేదికగా నిలిచేందుకు విశాఖలో సర్వం సిద్ధమైంది. పారిశ్రామిక దిగ్గజాలన్నీ కలిసి ఒక్క చోట చేరనున్నారు. పారిశ్రామికవేత్తలు, కంపెనీలు రాష్ట్రానికి వచ్చేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు గాంచిన విశాఖ వారికి ఆహ్వానం పలుకుతోంది. రెండు రోజుల పాటు జరిగే పెట్టుబడుల సదస్సుకు విశాఖ ముస్తాబైంది. విశాఖ వేదికగా జరిగే ఈ భారీ ఈవెంట్ కి అగ్రశ్రేణి పారిశ్రామిక వేత్తలు భారీగా హాజరవుతున్నారు.
మనదగ్గర ఉన్న వనరులు, ఏపీ శక్తిసామర్ధ్యాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు కల్పిస్తున్న అవకాశాలను ఏపీ అధికారులు పారిశ్రామిక వేత్తలకు వివరించనున్నారు. ఇందులో భాగంగా విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు ఆహ్వానం పలుకుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరినీ సమ్మిట్కు హాజరు కావాలని కోరారు. పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు చూడాలని పారిశ్రామికవేత్తలను కోరారు.
మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో జరిగే సమ్మిట్ కు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని.. త్వరలో కలుద్దామని జగన్ పేర్కొన్నారు. కాగా, ఈ సమ్మిట్ కు రిలియన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కేఎం బిర్లా, సజ్జన్ జిందాల్, సంజీవ్ బజాజ్, అర్జున్ ఒబెరాయ్ సహా పలువురు దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో పాటు కేంద్ర మంత్రులూ హాజరవుతున్నట్లు తెలుస్తుంది.
కాగా, విశాఖనే ఏపీ రాజధాని అని త్వరలోనే తాను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతానని సీఎం జగన్ ఢిల్లీ ఇన్వెస్టర్ల మీటింగ్ లో వెల్లడించగా.. ఇప్పుడు ఈ విశాఖ ఇన్వెస్టర్ల సమ్మిట్ ఆసక్తిగా మారింది. ఈ సమ్మిట్ అనంతరం జగన్ తన పరిపాలనను విశాఖకు తరలించే అవకాశం ఉన్నట్లు అటు రాజకీయ ఇటు అధికార వర్గాలలో కూడా తీవ్ర ప్రచారం జరుగుతుంది. ఈక్రమంలో ఈ సమ్మిట్.. అందులో రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు.. సమ్మిట్ అనంతరం ఏపీ ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలపై ఏపీ రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.