MLC Kavita: సోనియాపై పొగడ్తలు.. మోడీపై విమర్శలు.. ఢిల్లీలో కేసీఆర్ కుమార్తె ఆసక్తికర వ్యాఖ్యలు!

MLC Kavita: కాంగ్రెస్ నేత సోనియా గాంధీని తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ప్రశంసించారు. అలాగే ప్రధాని మోడీపై విమర్శల వర్షం కురిపించారు. ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వస్తే మహిళా బిల్లు తెస్తామని 2014, 2018లో మోడీ మాటిచ్చారని.. కానీ ఆ మాటను తప్పారని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. కానీ సోనియా.. ఈ బిల్లును రాజ్యసభలో పెట్టారని.. ఆమెకు సెల్యూట్ కొట్టారు.
కాగా, ఈనెల 9న విచారణకు రావాలని ఈడీ నోటీసు ఇచ్చిందని, 11న విచారణకు తమ ఇంటికి రమ్మని ఈడీని కోరానన్నారు. ఈమేరకు ఈడీకి సమాచారం ఇచ్చినా ఈడీ ఒప్పుకోలేదన్నారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఎందుకు విచారించరని కవిత ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థలు మహిళ ఇంటికి వచ్చి విచారించాలన్నది చట్టం చెబుతోందని, మహిళలను విచారించే పద్ధతిపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు.
ఇది తన ఒక్క సమస్యే కాదని, ఈడీ ఎందుకింత హడావుడిగా దర్యాప్తు చేస్తుందో అర్థం కావడం లేదని కవిత చెప్పారు. తనతోపాటు ఎవర్ని విచారించినా తనకు ఇబ్బంది లేదన్నారు. నేనేం తప్పు చేయలేదు, విపక్షాల మాట కూడా వినాలి, నాతోపాటు ఎవర్ని విచారించినా ఇబ్బంది లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. 27 ఏళ్లుగా మహిళా బిల్లు కోసం చర్చ జరుగుతోంది. మహిళా బిల్లును కోల్డ్ స్టోరేజ్లో పడేశారని ఆగ్రహించారు.
రేపు జంతర్మంతర్ వద్ద మహిళా బిల్లు కోసం ధర్నా చేస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో అధికారంలో లేని రాష్ట్రాల్లో మోడీ కంటే ముందు ఈడీ వస్తోందని కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారని, అది సాధ్యం కాకపోవడంతో తనను టార్గెట్ చేశారని ఆమె ఆరోపించారు. దర్యాప్తు సంస్థలతో తమ పార్టీ నేతలను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.