Sri Sathyasai District: కదిరిలో ఉద్రిక్తత.. వైసీపీ కార్యకర్తల భుజాలపైకెక్కి టీడీపీపై మీసం మెలేసిన సీఐ!

Sri Sathyasai District: ఏపీలో శాంతిభద్రతలు, పోలీసుల తీరుపై ప్రతిపక్ష నేతలు చాలా కాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ పోలీసులు వైసీపీ నేతలకు, కార్యకర్తలకు అండగా ఉండడం వలనే రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతింటున్నాయని.. పోలీసుల అండతోనే వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయని ప్రతిపక్ష పార్టీలు వాపోతున్నాయి. అది నిజమేనేమో అనేలా ఓ సీఐ వైసీపీ కార్యకర్తల భుజాల మీదకెక్కి టీడీపీ శ్రేణులపై మీసం మెలేసి తొడగొట్టారు.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో శనివారం నుండి ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఇక్కడి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్స సందర్భంగా అధికారులు ఆలయం చుట్టు పక్కల ఉన్న షాపులను తొలగించారు. అయితే, ఉన్న పళంగా తమ దుకాణాలను తొలగిస్తే ఉపాధి కోల్పోతామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కదిరి నియోజకవర్గ ఇంఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ వారికి అండగా నిలిచి.. పూర్తిగా అడ్డుగా ఉన్న షాపులను తొలగించి మిగతావి వదిలేయాలని కోరారు.
కానీ, ఆలయ అధికారులు అందుకు ఒప్పుకోకపోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. సీఐ మధు అక్కడికి చేరుకొని టీడీపీ వర్గీయులను అడ్డుకుని షాపులను తొలగించేలా పురమాయించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్, సీఐ మధు మధ్య మాటా మాటా పెరిగి గొడవగా మారి.. టీడీపీ శ్రేణులపై సీఐ దుర్భాషకి దిగారు. దీంతో టీడీపీ శ్రేణులు చెన్నై జాతీయ రహదారిపై ఆందోళనకు దిగాయి.
టీడీపీ మహిళా కార్యకర్తలను సైతం సీఐ మధు దుర్భాషలాడడంతో వారు సీఐ ఇంటి ముందు ధర్నాకి దిగారు. అలా ఉండగానే వైసీపీ కార్యకర్తలు కూడా రంగంలోకి దిగారు. దీంతో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. అదే సందర్భంలో వైసీపీ కార్యకర్తలు సీఐ మధును భుజాలపైకి ఎత్తుకోగా.. ఆయన మీసం మెలేసి తొడగొట్టారు. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.